Begin typing your search above and press return to search.

బూటు కాలితో టేబుళ్లను తన్నిన సీఐ .. పోలింగ్ బూత్ లో వీరంగం

By:  Tupaki Desk   |   1 Dec 2020 3:15 PM IST
బూటు కాలితో టేబుళ్లను తన్నిన సీఐ ..  పోలింగ్ బూత్ లో వీరంగం
X
హైదరాబాద్ లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని డివిజన్లలో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. హైదరాబాదులో ఇవాళ జీ హెచ్ఎంసీ ఎన్నికలకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు దాకా కొనసాగనుంది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవ జరగకుండా 52 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చేపట్టారు. అయినా కొన్ని చోట్ల మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది.

కూకట్ పల్లి లో 121 డివిజన్ దీనబంధు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్ నెంబర్ 48 వద్ద జగద్గిరిగుట్ట సీఐ హల్ చల్ చేస్తున్నట్లు తెలిసింది. పోలింగ్ బూత్ లోని టేబుళ్లను సీఐ తన బూటు కాళ్లతో తన్నారని, బీజేపీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో తిడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై అడిగినందుకు సీఐ దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఓల్డ్ మలక్ పేట డివిజన్ 26లో పోలింగ్ రద్దు అయ్యింది. ఆ ప్రాంతంలో ఎల్లుండి పోలింగ్ నిర్వహించడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు తప్ప మిగతా డివిజన్లలో ప్రశాంతంగానే ఓటింగ్ సాగుతోంది. అయితే పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం మాత్రం కనిపించలేదు. ఇంకా పోలింగ్ కి మూడు గంటలే సమయం ఉండగా ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే నమోదైంది.