Begin typing your search above and press return to search.

హైదరాబాదీలు కదలండి.. ఓటేయండి!

By:  Tupaki Desk   |   1 Dec 2020 12:45 PM IST
హైదరాబాదీలు కదలండి.. ఓటేయండి!
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటేయడానికి వస్తున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున సైతం ఓటేశారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సినీ తారలు ప్రచారం చేశారు.

ప్రతి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 50శాతం లోపే ఉంటుందని.. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ సెలెబ్రెటీలతో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా టాలీవుడ్ హీరోలు నాగార్జున, విజయ్ దేవరకొండ తాజాగా ఒక వీడియోను రూపొందించి విడుదల చేశారు.

‘మన నగరం.. మన రాజధాని.. మన హైదరాబాద్.. మన భవిష్యత్.. మన పాలన.. మన ఓటు.. అన్నీ మన చేతిలోనేఉన్నాయి.. ఓటు వేద్దాం.. మన శక్తిని చూపిద్దాం’ అని నాగార్జున హైదరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ ‘నగర పౌరులు ఓటుహక్కును వినియోగించుకొని కోవిడ్ నిబంధనల ప్రకారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చారు.

ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఓటేయాలని ట్వీట్ చేశారు.ఓటు హైదరాబాదీయుల హక్కని, ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన నగరం కోసం హైదరాబాదీలే నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన రాజకీయాలకు ఊతమివ్వద్దని అన్నారు.

ఇక నటుడు పోసాని మురళీ కృష్ణ సైతం నగర పౌరులు ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. దర్శకుడు శంకర్ సైతం హైదరాబాద్ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్టార్ యాంకర్ సుమ కనకాల సైతం ఓటు చైతన్య కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.