Begin typing your search above and press return to search.

‘ఎగ్జిట్’ తలకిందులు: బ్యాలెట్ లో కమల వికాసం.. స్పీడు తగ్గిన కారు

By:  Tupaki Desk   |   4 Dec 2020 10:15 AM IST
‘ఎగ్జిట్’ తలకిందులు: బ్యాలెట్ లో కమల వికాసం.. స్పీడు తగ్గిన కారు
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాల రాక ప్రారంభమైంది. మొదట ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అవి ముగిశాక ప్రజలు వేసిన ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండోస్థానానికి పరిమితమైంది. కొన్ని పాతబస్తీ డివిజన్లలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో ఎంఐఎంతో సమానంలో బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సాధించడం విశేషంగా మారింది.

ఉదయం 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 50 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత కనబరుస్తోంది. టీఆర్ఎస్ 25 చోట్ల మాత్రమే ఆధిక్యతలో ఉంది. ఇదే దూకుడు, ఆధిక్యత ముందు ముందు కొనసాగితే గ్రేటర్ పీఠం బీజేపీదే.

అయితే ఉద్యోగులు సహజంగానే టీఆర్ఎస్ పై చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వారికి పీఆర్సీ, టీఏ, డీఏలు ఇవ్వకుండా మొన్నటివరకు సగం జీతాలు ఇచ్చిన కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు. వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇక ప్రజలు వేసిన ఓట్లు లెక్కిస్తే కానీ బీజేపీ బలం, టీఆర్ఎస్ బలం ఎంతనేది తేలనుంది. సాయంత్రం వరకు తుది ఫలితాలు రానున్నాయి.

కాగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ ముందు నిలవలేకపోతున్నాయి.కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి.