Begin typing your search above and press return to search.

పాక్ నుంచి భారత్ కు తీసుకొచ్చిన గీత గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?

By:  Tupaki Desk   |   10 July 2022 4:30 AM GMT
పాక్ నుంచి భారత్ కు తీసుకొచ్చిన గీత గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?
X
చిన్నతనంలో తప్పిపోయి.. అనూహ్యంగా పాకిస్థాన్ కు చేరుకొని.. అక్కడి ఒక ఎన్జీవో పర్యవేక్షణలో ఉన్న గీత.. సోషల్ మీడియా కారణంగా వెలుగులోకి రావటం.. ఆమె ఉదంతం గురించి తెలిసి చలించిన దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ధతో ఇండియాకు రావటం తెలిసిందే. మాట్లాడలేని గీత ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలతో పాటు.. ఇప్పుడే మళ్లీ వార్తల్లోకి ఎందుకు వచ్చారన్న డౌట్ రాక మానదు. ఇంతకూ ఇప్పుడు మళ్లీ మీడియాలోకి ఎందుకు వచ్చారంటే..

తప్పిపోయి పాకిస్థాన్ కు వెళ్లి దాదాపు పదిహేనేళ్లు అక్కడే ఉండి.. తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె.. 2015లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో తిరిగి రావటమే కాదు.. మధ్యప్రదేశ్ లోని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాను తన కుటుంబంతో కలిసి ఉండటంలో కీలక భూమిక పోషించిన భోఫాల్ జీఆర్పీ పోలీసులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.

ఈ సందర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సైగలతో చకచకా సమాధానాలు ఇచ్చింది. తాను భారత్ ను ఇష్టపడుతున్నాని.. పాకిస్థాన్ లోనూ తనను చాలా బాగా చూసుకున్నట్లు చెప్పింది. పాక్ లో నాన్ వెజ్ ఎక్కువని.. అయితే చిన్నప్పుడు తన తల్లి వెజ్ తినాలని చెప్పటంతో తాను నాన్ వెజ్ తినలేదని.. తన మాటకు వారు తనకు వెజ్ మాత్రమే పెట్టేవారని చెప్పింది.

పాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి వారితో తాను కొంతకాలం టచ్ లో ఉన్న విషయాన్ని వెల్లడించింది. నిజానికి గీత పేరు రాధ. కాకుంటే.. ఆమె కట్టుబొట్టు.. అలవాట్లతో ఆమెకు గీతగా పాకిస్థాన్ లోని వారు పేరు పెట్టటంతో ఆ పేరు సుపరిచితమైంది. మొత్తంగా తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్న గీత.. అలానే కలకాలం ఉండాలని కోరుకుందాం.