Begin typing your search above and press return to search.

క‌ష్టార్జితం.. 7 కోట్లు ఇచ్చేశాడు.. క‌నీసం పేరు కూడా చెప్ప‌కుండా వెళ్లపోయాడు!

By:  Tupaki Desk   |   28 Feb 2021 4:36 AM GMT
క‌ష్టార్జితం.. 7 కోట్లు ఇచ్చేశాడు.. క‌నీసం పేరు కూడా చెప్ప‌కుండా వెళ్లపోయాడు!
X
రాముల వారి క‌ళ్యాణం జ‌రుగుతోంది.. ఓ వంద రూపాయ‌లు చందా ఇవ్వ‌మ‌ని అడిగితే.. త‌ప్పించుకుని తిరిగే వారు కోకొల్ల‌లు. పోనీ.. ఇచ్చారే అనుకోండి.. ఇక‌, స‌ద‌రు చందా ర‌సీదుపై ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు త‌మ ఇంటి పేరుతో స‌హా త‌మ‌పేరును రాయించుకుని ప్ర‌చారం చేసుకునేవారే ఎక్కువ‌! కొంత నిర్మొహ‌మాటంగా మాట్లాడుకుంటే.. ఏటా జ‌రిగే తంతే ఇది! ఇచ్చేది త‌క్కువ ప్ర‌చారం ఎక్కువ‌.. అనే నానుడి వీరి వ‌ల్లే పుట్టిదంటే అతిశ‌యోక్తి కాదు. అయితే.. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు మాత్రం.. తాము ఏం చేశామ‌నే విష‌యాన్ని కూడా వెలుప‌ల‌కు రాకుండా.. గుప్త దానాలు చేస్తుంటారు. కొండంత ఉప‌కారం చేసి.. కూడా.. చీమంత ప్ర‌చారం కోరుకోరు.

ఇలాంటి వారు అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తుంటారు. తాజాగా ఇలాంటి దాతే.. ఒకాయ‌న .. త‌న క‌ష్టార్జితం.. రూపాయి రెండూ కాదు.. వెయ్యి.. ల‌క్షా కాదు.. ఏకంగా 7 కోట్ల రూపాయ‌ల‌ను దానం చేశారు. అంతేకాదు.. త‌న పేరును ఎవ‌రికీ చెప్ప‌లేదు. పైగా బ్యాంకు వివ‌రాల‌ను కూడా ఎవ‌రికీ చెప్పొద్ద‌ని ప్రాధేయ ప‌డ్డాడు. అయితే.. ఇదేమీ బ్లాక్ మ‌నీ కాదు.. ఆయ‌న చేసింది.. త‌క్కువ దాన‌మేమీ కాదు.. మీరూ చ‌ద‌వండి..!! చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడికి ప్రవాస భారతీయ భక్తుడు రూ.7 కోట్ల విరాళం అందించాడు. ఆలయ ఈఓ వెంకటేశ్‌కు శనివారం ఉదయం విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75కోట్ల మేర ఖర్చు అవుతుందని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని ప్రవాస భక్తుడు చెప్పారని, ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.7 కోట్ల చెక్కు అందజేశారని ఆలయ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా దాత, ఆయన కుటుంబీలకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే విరాళం అందజేసిన భక్తుడు తన పేరును కానీ, త‌న వివ‌రాల‌ను కానీ వెల్లడించేందుకు నిరాకరించాడు. అంతేకాదు.. అధికారుల‌ను సైతం.. ప్రాధేయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. దానం అంటే ఇదే క‌దా?!!