Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న ఇవ్వాలి.. లోక్‌స‌భ‌లో గ‌ళం విప్పిన టీడీపీ

By:  Tupaki Desk   |   29 March 2022 4:30 PM GMT
ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న ఇవ్వాలి.. లోక్‌స‌భ‌లో గ‌ళం విప్పిన టీడీపీ
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి.. 40 వ‌సంతాలు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోనూ.. పొరుగు రాష్ట్రాల్లోనూ.. అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా కూడా.. ప‌లు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ అభిమానులు ప‌సుపు పండ‌గ‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి.. అన్న‌గారి ప్ర‌స్తావ‌న రావ‌డం.. ఆయ‌న స్మృతుల‌ను స్మ‌రించుకోవ‌డం.. ఘ‌న నివాళుల‌ర్పించుకోవ‌డం.. పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఒక కీల‌క ఘ‌ట్టం కూడా చోటు చేసుకుంది. అన్న‌గారికి భార‌త ర‌త్న ఇవ్వాలంటూ.. దేశ అత్యున్నత చ‌ట్ట‌స‌భ‌లో టీడీపీ గ‌ళం వినిపించింది.

వాస్త‌వానికి అన్న‌గారికి భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ.. ఎప్ప‌టి నుంచో డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ.. అది నెర‌వేర డం లేదు. నిజానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న కుమార్తు పురందేశ్వ‌రి మంత్రిగా ఉన్న‌ప్పుడు.. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో అన్న‌గారి విగ్ర‌హం అయితే.. పెట్టించారు కానీ.. కేంద్రంతో చ‌ర్చించో.. పోరాడో.. భార‌త‌ర‌త్న మాత్రం సాధించ‌లేక పోయారు. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు మార‌డంతో ఈ ప్ర‌తిపాద‌న అక్క‌డే ఉండిపోయింది. నిజానికి 2014-19 మ‌ధ్య మోడీ ప్ర‌భుత్వంతో చంద్ర‌బాబు టై.. పెట్టుకున్నా.. ఈ విష‌యం ప్ర‌స్తావించ‌లేదు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా అన్న‌గారికి భార‌త‌ర‌త్న అనే విష‌యం.. ప్ర‌స్తావ‌న‌కు రాకుండా పోయింది. అయితే.. తాజాగా పార్టీ 40వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా న‌దమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో డిమాండ్ చేశారు. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని సభలో ప్రస్తావించిన ఆయన.. తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారన్నారు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ స్థాయిలో ఎన్టీఆర్ పాల‌న సాగింద‌ని.. తెలిపారు.

అలాంటి నేత‌.. భార‌తర‌త్న‌కు సంపూర్ణ అర్హుల‌ని..కేంద్ర ప్ర‌భుత్వం ఆదిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని.. గ‌ల్లా జ‌య‌దేవ్ విన్న‌వించారు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం రోజు..ఇలా పార్ల‌మెంటులో కోర‌డం.. ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.