Begin typing your search above and press return to search.

అపెక్స్ కౌన్సిల్ భేటీ .. కీలక నిర్ణయాలను ప్రకటించిన షెకావత్ !

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:36 PM GMT
అపెక్స్ కౌన్సిల్ భేటీ .. కీలక  నిర్ణయాలను ప్రకటించిన షెకావత్ !
X
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపీ సీఎం ‌ వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన లో ఉండటంతో అయన అక్కడినుంచి, తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది.

ఈ సందర్బంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను గజేంద్ర సింగ్‌ షెకావత్ ప్రకటించారు. ఏపి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పడిందని , నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరిగిందన్న ఆయన 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ అపెక్స్ కౌన్సిల్ బాధ్యతని అన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది. అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన వెల్లడించారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

ఈ సమావేశం అజెండా గా నాలుగు అంశాలను ఆయన చెప్పారు. :

కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలు నిర్ణయించడం.
కృష్ణా, గోదావరి నదుల పై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ( డి.పి.ఆర్) లను సమర్పించడం.
రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వినియోగం కోసం ఓ “పటిష్టమైన వ్యవస్థ” ఏర్పాటు.
కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు ఏపీకి తరలించడం.

అలాగే, కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలనీ నిర్ణయించాం అని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ అందుకు అభ్యంతరం చెప్పారు. అయినా, కేంద్రానికి అధికారం వుంటుందని చెప్పాం అని అయన తెలిపారు. ప్రాజెక్టుల “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” లు సమర్పించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని అన్నారు.ప్రాజెక్టుల వారీగా కృష్ణా నదీ జలాల వినియోగం పై ట్రిబ్యునల్ కు నిర్ణయాధికారం అప్పగింత. ఇప్పటికే సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసు ను తెలంగాణ ఉపసంహరించుకుంటామని తెలిపింది అని అయన తెలిపారు. అలాగే గోదావరీ నదీ జల వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు. ఇరు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన అనంతరం ఒక సంవత్సరంలోగా నిర్ణయం తీసుకుంటాం. కెసిఆర్ రేపే పంపుతామని హామీ ఇచ్చారు అని తెలిపారు. ప్రతి ఏడాది “అపెక్స్ కౌన్సిల్” సమావేశం అయుతే, సాధ్యమైనంత మేరకు వివాదాలను పరిష్కరించుకోవచ్చు. కృష్ణా నదీ పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరగాలన్న డిమాండు పై సంబంధిత ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. అందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటాము.శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాం ల నిర్వహణ సంబధిత బోర్డు పరియవేక్షిస్తుందని తెలిపారు.