Begin typing your search above and press return to search.

జమ్ము కశ్మీర్ ఆడింది ఆటా పాడింది పాటా ఆర్టికల్ 370 వల్లే..!

By:  Tupaki Desk   |   5 Aug 2019 6:49 AM GMT
జమ్ము కశ్మీర్ ఆడింది ఆటా పాడింది పాటా ఆర్టికల్ 370 వల్లే..!
X
జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోం మంత్రి రాజ్యసభ అనుమతి కోరిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అధికరణం చర్చనీయమైంది. ఇంతక ఈ ఆర్టికల్‌ లో ఏముంది... ఎందుకిది అంత కీలకం.. దీనివల్ల జమ్ముకశ్మీర్‌ కు కలిగే లాభమేంటి... కేంద్రానికి కలిగే నష్టమేంటి.. కేంద్రం దీన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటోందో చదవండి..

* ఇదీ నేపథ్యం..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తుంది. 1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌ లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

* ఆ మూడు అంశాల్లో తప్ప కేంద్రం ఏమీ చేయలేదు

జమ్ము-కశ్మీర్ విషయంలో కేంద్రం రక్షణ - విదేశాంగ - కమ్యూనికేషన్ల అంశాల్లో తప్ప ఇంకే విషయంలోనూ ఆ రాష్ట్ర అనుమతి లేకుండా ఏమీ చేయలేదు.

1951లో రాష్ట్రాన్ని - రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. 1956 నవంబర్‌ లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తైంది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది.

* ఇంతకీ ఆర్టికల్ 370 అంటే ఏంటి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అనేది నిజానికి కేంద్రంతో జమ్ము-కశ్మీర్‌కు ఉన్న బంధం గురించి చెబుతుంది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ - షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చలు జరిపిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని జోడించారు.

ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ - విదేశాంగ విధానాలు - కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా - అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు.

* మిగతా భారతీయులు ఏమీ చేయలేరక్కడ

జమ్ము-కశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 35ఎ ఉంది. అది శాశ్వత నివాసి నిబంధనలను ప్రస్తావిస్తుంది. ఇది ఆర్టికల్ 370లో భాగం కూడా.

దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌ లో భారత్‌ కు చెందిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారెవరూ భూములు - ఎలాంటి ప్రాపర్టీలూ కొనలేరు.

* రాష్ట్రపతి అధికారాలు కూడా పనిచేయవు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేసే నిబంధన ఉంది. కానీ అది జమ్ము-కశ్మీర్‌ లో పనిచేయదు.

దీనితోపాటు 370 కింద దేశ రాష్ట్రపతి జమ్ము-కశ్మీర్‌ లో ఆర్థిక అత్యవసర స్థితి అమలు చేయలేరు. ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయవచ్చు.

అందుకే రాష్ట్రంలో అశాంతి - హింస లాంటివి జరిగినప్పుడు రాష్ట్రపతి స్వయంగా అక్కడ అత్యవసర స్థితి విధించలేరు. రాష్ట్రం నుంచి దానికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆయన అలా చేయాల్సి ఉంటుంది.

* ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుంచి తొలగించడం సాధ్యమేనా

ఆర్టికల్ 370ని తొలగించడానికి సంబంధించి 2015 డిసెంబర్‌ లో సుప్రీం కోర్ట్‌ లో ఒక పిటిషన్‌ పై విచారణ జరిగింది. అప్పుడు "దీనిని రాజ్యాంగం నుంచి తొలగించే నిర్ణయం పార్లమెంటు మాత్రమే తీసుకోగలదని" కోర్టు స్పష్టం చేసింది.

అప్పటి చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ధర్మాసనం "అది కోర్టు పనా - ఈ ఆర్టికల్ తొలగించడం - లేదా ఉంచడంపై నిర్ణయం తీసుకోవాలని మీరు పార్లమెంటుకు చెప్పగలరా. అది చేయడం ఈ కోర్టు పని కాదు" అని వ్యాఖ్యానించింది.

రాజ్యాంగంలోని పార్ట్ 21లో 'తాత్కాలిక నిబంధన' అనే శీర్షిక ఉన్నప్పటికీ - ఆర్టికల్ 370 ఒక 'శాశ్వత నిబంధన' అని జమ్ము-కశ్మీర్ హైకోర్ట్ 2015లోనే చెప్పింది.

ఆర్టికల్ 370 మూడో విభాగం ప్రకారం దానిని ఉపసంహరించడంగానీ - సవరించడంగానీ కుదరదని కోర్టు తెలిపింది.

"రాష్ట్ర చట్టం 35ఎను అది సంరక్షిస్తుంది. జమ్ము-కశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా భారత్‌ లో కలిసి లేదు. అది భారత్‌ తో ఒప్పంద పత్రంపై సంతకం చేసేటప్పుడే - ఒక పరిధి వరకూ తన సౌర్వభౌమాధికారాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకుంది" అని హైకోర్ట్ వివరించింది.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు అనుమతిని కోరింది.. రద్దు దిశగా అన్ని ఏర్పాట్లూ చేయడంతో భవిష్యత్తులో ఈ ఆర్టికల్ కనుమరుగు కానుంది. ఇకపై కశ్మీర్ కూడా భారతదేశంతో సమానంగా మారనుంది.