Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌స్టర్లతో స్నేహం .. సుశీల్‌ కేసులో ఊహించని కోణం వెలుగులోకి !

By:  Tupaki Desk   |   25 May 2021 8:37 AM GMT
గ్యాంగ్‌స్టర్లతో స్నేహం .. సుశీల్‌ కేసులో ఊహించని కోణం వెలుగులోకి !
X
ఇండియా స్టార్ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పై కేస్ లో ఊహించని మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఉత్తరభారతానికి చెందిన పేరు మోసిన గ్యాంగ్‌ స్టర్‌ సందీప్‌ అలియాస్‌ కాలా జతేది పేరు బయటకు వచ్చింది. అంతేకాదు, మరికొన్ని గ్యాంగ్‌ స్టర్‌ గ్రూపుల ప్రమేయం తో బాలీవుడ్‌ సినిమాను సుశీల్‌ ఉదంతం తలపిస్తోంది. 18 రోజులపాటు కేవలం ఢిల్లీ పోలీసుల నుంచే కాదు, సందీప్‌ నుంచి తప్పించుకొనేందుకు సుశీల్‌ విశ్వప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈనెల 4న రాత్రి జరిగిన ఘర్షణలో రెజ్లర్‌ సాగర్‌ పైనేకాదు అతడి స్నేహితుడు సోనుపై కూడా సుశీల్‌ అండ్‌ కో దాడి చేసింది. ఈ సోను గ్యాంగ్‌ స్టర్‌ సందీప్‌ కు మేనల్లుడు. సోనుపై హత్య, బలవంతపు వసూళ్లు, దొంగతనం తదితర 19 కేసులున్నాయి. తన మేనల్లుడిపై దాడి చేయడంతో ఆగ్రహించిన సందీప్‌, సుశీల్‌పై కక్ష పెంచుకున్నాడు.

ఇక సోను, ఇతరుల ద్వారా ఢిల్లీలో పెద్ద ఎత్తున పలు వివాదాస్పద ఆస్తులను సందీప్‌ సెటిల్‌ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సందీప్ తో చేతులు కలిపిన సుశీల్‌ కుమార్‌ వాయువ్య ఢిల్లీలోని మోడల్‌ టౌన్‌ ఎం-2 బ్లాక్‌ లో ఓ ఫ్లాట్‌ కొన్నట్టు సమాచారం. మొత్తం వివాదానికి ఈ ఫ్లాటే. పలువురు క్రిమినల్స్‌ కు ఆశ్రయంగా మారిన ఈ ఫ్లాట్‌ కేంద్రంగా జతేది-లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూపులు అనేక నేరాలకు పథకాలు రూపొందించినట్టు పోలీసులు వెల్లడించారు. సుశీల్‌-సందీప్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం..ఎం-2 బ్లాక్‌ ఫ్లాట్‌ అమ్మగా వచ్చిన డబ్బులో సుశీల్‌, జతేది సమాన వాటాలు తీసుకోవాలి. కానీ కొద్ది నెలలుగా..జైలులో ఉన్న సందీప్‌ ప్రత్యర్థి వర్గం గ్యాంగ్‌ స్టర్లు నీరజ్‌ బవాన, నవీన్‌ బాలిలతో సుశీల్‌ కుమార్‌ కు స్నేహం కుదిరింది. దాంతో సుశీల్‌-సందీప్‌ మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి అని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

మరోవైపు డబ్బుకోసం, ఫ్లాట్‌ అమ్మకంకోసం సుశీల్‌పై సందీప్‌ ఒత్తిడి పెంచాడు. దాంతో ఫ్లాట్‌ ఖాళీ చేయాలని అందులో ఉంటున్న సాగర్‌ తదితరులను సుశీల్‌ ఆదేశించాడు. ఇది జతేది గ్యాంగ్‌కు ఆగ్రహం తెప్పించడంతో పాటు వారు సుశీల్‌ ను బహిరంగంగా దూషించడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన సుశీల్‌ తనతో తేల్చుకోవాలని సాగర్‌కు సవాల్‌ విసిరాడు. ఇక జతేది విషయం తెలిసిన సుశీల్‌ అతడిని ఎదిరించే సాహసం చేయబోడని సోను అంచనా వేశాడు. అయితే ఆవేశపరుడైన సుశీల్‌ జతేది వ్యతిరేక వర్గం అండకూడా ఉండడంతో తన ఆధిపత్యం చాటేందుకు ఘర్షణకు దిగినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాదు ఘర్షణ మొత్తాన్ని వీడియో తీయించిన సుశీల్‌, దాన్ని సర్క్యులేట్‌ చేయడం ద్వారా తన జోలికి రావద్దని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాలనుకున్నట్టు పోలీసులు తెలిపారు. కానీ సాగర్‌ మృతి, తన బంధువు తీవ్రంగా గాయపడడంతో గ్యాంగ్‌ స్టర్‌ జతేది సుశీల్‌ ను టార్గెట్‌ చేశాడు.దీనితో అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ హత్య కేసులో అరెస్టయిన సుశీల్‌ ను ఢిల్లీ పోలీసులు సోమవారం నాలుగు గంటలు విచారించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటన అనంతరం ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై విచారించినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో అరెస్ట్ అయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై వేటుకు రైల్వే సిద్ధమైంది. నార్తరన్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌ గా ఉన్న సుశీల్‌ కుమార్‌ ను 2015లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ది కోసం ఛత్రసాల స్టేడియంకు ఓఎస్‌ డీగా పంపింది. గతేడాదితో డిప్యుటేషన్ ముగియడంతో పొడిగించాలని సుశీల్ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో త్వరలోనే వెనక్కి వెళ్లి రైల్వేలో చేరాల్సి ఉంది. అంతలోనే సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ అరెస్ట్ అయ్యాడు. రాణా హత్య కేసుకు సంబంధించిన నివేదిక ఆదివారం రైల్వే బోర్డుకు అందింది. అతడిపై ఎఫ్ ఐ ఆర్ నమోదైన నేపథ్యంలో రైల్వే విధుల నుంచి అతడిని సస్పెండ్ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో సుశీల్ సస్పెన్షన్‌ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాణా హత్య తర్వాత పరారీలో ఉన్న సుశీల్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.