Begin typing your search above and press return to search.

కేంద్ర మాజీ మంత్రి పాడె మోసిన రాహుల్ గాంధీ !

By:  Tupaki Desk   |   19 Feb 2021 2:00 PM IST
కేంద్ర మాజీ మంత్రి  పాడె మోసిన రాహుల్ గాంధీ !
X
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సతీశ్‌ శర్మ ఈ కారణంగానే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సతీశ్ శర్మ 11 అక్టోబరు 1947లో తెలంగాణలోని సికింద్రాబాద్‌ లో జన్మించారు. అమేథీ, రాయ్‌ బరేలీ నుంచి మూడుసార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అలాగే, రాజ్యసభ సభ్యుడిగానూ మూడు పర్యాయాలు పనిచేశారు.

1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌ లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సతీశ్‌ శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సతీశ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈ రోజు ఆయ‌న అంత్యక్రియలను ఢిల్లీలో జరుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌లు మోశారు. మొద‌ట‌ ప్రొఫెషనల్‌ కమర్షియల్‌ పైలెట్ గా ప‌ని చేసిన ఆయ‌న అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు‌. రాజీవ్ హత్య తర్వాత 1991లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 2004లో అమేథీ నుంచి పోటీ చేసి.. గెలిచారు . 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు.