Begin typing your search above and press return to search.

బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   6 Oct 2020 6:00 PM IST
బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి
X
దేశంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే అదే బీజేపీకి చెందిన వాజ్ పేయి హయాంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా చేసిన నేతకు తాజాగా శిక్ష పడడం కలకలం రేపింది. అది బొగ్గు కుంభకోణం కావడంతో ఆ మరక ఇప్పుడు బీజేపీకి అంటుకున్నట్టైందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

జార్ఖండ్ అంటేనే ప్రకృతి వనరులకు పెట్టింది పేరు. అక్కడ బొగ్గు సహా ఇతర ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. గిరిజన జనాభా ఎక్కువ. పైగా అడువులు విస్తరించి ఉన్నాయి. దీంతో అక్కడి నిక్షేపాలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం, కుంభకోణం చోటుచేసుకుంటూనే ఉంటుంది.

దేశంలోనే ప్రముఖమైన కుంభకోణంగా అప్పట్లో జార్ఖండ్ లో వెలుగు చూసిన బొగ్గు కుంభకోణం రాజకీయాలను షేక్ చేసింది. నాటి సీఎం ‘శిబుసోరేన్’పై కూడా దీనిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది.

తాజాగా ఈ బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ తోపాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది.

1999లో జార్ఖండ్ లో బొగ్గు బ్లాక్ ల కేటాయింపుల్లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ అక్రమాలకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఉక్కు, బొగ్గుగనుల శాఖ మంత్రిగా దిలీప్ రాయ్ పనిచేశారు. ఆ సమయంలోనే ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ తీర్పు బీజేపీ ని ఇరుకునపెట్టినట్టైంది. ఇందులో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి ఉండడంతో విమర్శలు చెలరేగుతున్నాయి.