Begin typing your search above and press return to search.

మోడీ రాసిన లేఖను షేర్ చేసి.. కలుసుకోవాలని ఉందన్న మాజీ స్టార్ క్రికెటర్

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:24 AM GMT
మోడీ రాసిన లేఖను షేర్ చేసి.. కలుసుకోవాలని ఉందన్న మాజీ స్టార్ క్రికెటర్
X
అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ప్రధాని మోడీ. ఆయన కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు.. వ్యవహరించే పద్దతి రోటీన్ కు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఒకవైపు ఏదైనా ఇష్యూ మీద న్యాయం కోసం లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చి.. ప్రభుత్వం తీరును తప్పు పడుతూ మండిపడుతుంటే.. స్పందించేందుకు ఏ మాత్రం తీరిక లేని ప్రధాని మోడీ.. విదేశీ ఆటగాళ్లకు.. ఇతర ప్రముఖులకు మాత్రం లేఖలు రాయటం లాంటి చిత్రమైన పనులు చేస్తారు. మీ హయాంలో పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నాం సామీ అంటూ సగటు జీవి మీడియాలోనూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నిస్తే అందుకు స్పందిచని ప్రధానిగా మోడీ నిలుస్తారని చెప్పాలి.

అలాంటి ఆయన.. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు విదేశీ ఆటగాళ్లకు లేఖలు రాయటం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని తనను గుర్తించి లేఖ రాసిన వైనానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భారత్ పట్ల తనకున్న అభిమానాన్ని గుర్తించి ప్రధాని మోడీ లేఖ రాసిన వైనంపై భావోద్వేగానికి గురయ్యారు.

భారత్ ను ప్రపంచ శక్తి కేంద్రంగా పేర్కొన్న ఆయన.. ప్రధాని మోడీకి తన స్పందనను తెలియజేశారు. ‘భారత్ పట్ల నాకున్న అభిమానాన్ని గుర్తించి లేఖ రాసినందుకు ధన్యవాదాలు. 2003లో మొదటిసారి భారత్ లో అడుగు పెట్టిన నాటి నుంచి ప్రతి టూర్ లోనూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా. భారత్ కు వచ్చిన ప్రతిసారీ ప్రేమ మరింత పెరుగుతోంది. త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. ఇటీవల ఓ సందర్భంలో భారత్ లో మీకు బాగా ఇష్టమైనది ఏమిటని కొందరు అడిగారు. నేను మరో ఆలోచన లేకుండా.. భారత్ ప్రజలు అని బదులిచ్చా’ అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వన్య ప్రాణుల్ని సంరక్షించటంలో భారత్ గ్లోబల్ లీడర్ గా వ్యవహరిస్తోందని.. అందుకు భారత్ కు ధన్యవాదాలు పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇక.. మోడీ తనకు రాసిన లేఖను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అందులో పీటర్సన్ పై ప్రశంసల జల్లు కురిపించారు మోడీ.

‘‘క్రికెటర్ గా మీరు గ్రౌండ్ లో ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ లు మా అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. భారత అభిమానులతో మీకున్న అనుబంధం చాలా గొప్పది’’ అంటూ అతడ్ని పొగిడేస్తూ లేఖ రాశారు. లేఖ రాసిన లెఖకు రిప్లై ఇవ్వటమే కాదు.. కలవాలని ఉందని ఆకాంక్షను వ్యక్తం చేసిన పీటర్సన్ కు ప్రధాని మోడీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.