Begin typing your search above and press return to search.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి .. సీఎం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:10 AM IST
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి .. సీఎం కీలక నిర్ణయం !
X
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పెండింగ్‌ లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం భర్తిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారీ పేరును ఖరారు చేస్తూ ప్రతిపాదనను రాజ్‌భవన్‌ కు పంపారు.

కాగా గత కొద్ది రోజులుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తిపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి పేరును సామాజిక సేవా రంగం కింద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించి గవర్నర్ అమోదానికి పంపారు.

అయితే కౌశిక్ రెడ్డి పేరును పంపి మూడు నెలలు గడుస్తున్నా ఆయన పేరును గవర్నర్ తమిళి సై అమోదించలేదు. దీంతో సీఎం కేసిఆర్, కౌశిక్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కౌశిక్ రెడ్డిని ఇటివల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.

తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూదనా చారిని ఫైనల్‌ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది కేబినేట్‌.

మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం నుండి సీఎం కేసిఆర్ వెన్నంటే ఉండి పార్టీకి సేవలు అందించారు. దీంతో ఆయన 2014లో భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో స్పీకర్‌గా అవకాశం దక్కింది. అయితే 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలుపొందారు.

దీంతో ఆయనకు అప్పటి నుండి ఎమ్మెల్సీగా అవకాశం లేదా, రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా..ఎట్టకేలకు మూడు సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసిఆర్.

మరోవైపు మధుసూదనాచారి పేరును మండలి చైర్మన్‌ గా కూడా ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో స్పీకర్ గా చేసిన అనుభవం ఉండడంతో పాటు సీఎం కేసిఆర్‌కు సన్నిహితంగా నేతల్లో ఆయన ఒకరు. అయితే మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి విముఖంగా ఉన్న నేపథ్యంలోనే ఆయన పేరు తెరమీదకు వచ్చింది.

గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన్ను కేబినెట్‌ లో తీసుకుంటే మధుసూదనాచారీకి మండలి చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.