Begin typing your search above and press return to search.

రెండు వ్యాక్సిన్లు వేసుకున్న ఆ మాజీ సీఎం సతీమణికి పాజిటివ్

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:00 AM GMT
రెండు వ్యాక్సిన్లు వేసుకున్న ఆ మాజీ సీఎం సతీమణికి పాజిటివ్
X
నిజంగానే అందరికి ఇదో హెచ్చరిక. కరోనా మహమ్మారికి చిక్క కుండా ఉండేందుకు అనునిత్యం అప్రమత్తం గా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం తెలియజేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి కమ్ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు.. ఆమె కుమార్తె కూడా పాజిటివ్ బారిన పడినట్లుగా తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలియజేశారు. నిజానికి ఈ ఉదంతం అందరికి వార్నింగ్ లాంటిదని ఎందుకంటే.. డింపుల్ ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల కోటాను పూర్తి చేసుకున్నారు.

అయినప్పటికీ ఆమెకు పాజిటివ్ కాక తప్పలేదు. అంటే.. వ్యాక్సిన్లు వేసుకున్నాం. మాకేం కాదన్న భరోసా తో ఉండే వారితో పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం.. కరోనా కాలంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న డింపుల్.. తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

తనకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని.. కరోనా టీకా డోసులు రెండూ వేసుకున్నట్లు వెల్లడించారు. అయితే.. కొవిడ్ పాజిటివ్ అయినప్పటికీ ఎలాంటి రోగ లక్షణాలు లేవని పేర్కొన్నారు. అయినప్పటికి అందరి భద్రత కోసం తాను ఐసోలేషన్ లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు.. యూపీ లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో తలమునకలై ఉన్న అఖిలేశ్.. తాజాగా తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. తన భార్య..కుమార్తెకు పాజిటివ్ అని తేలటంతో ఆయన ప్రచారానికి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.