Begin typing your search above and press return to search.

హస్తం పార్టీ సంచలనం... ఏపీసీసీ చీఫ్ గా సాకే

By:  Tupaki Desk   |   16 Jan 2020 1:28 PM GMT
హస్తం పార్టీ సంచలనం... ఏపీసీసీ చీఫ్ గా సాకే
X
నిజంగానే గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయమే తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తానే బాధ్యుడినంటూ రాహుల్ గాంధీ కాడి కింద పడేస్తే... తామూ రాహుల్ వెంటేనంటూ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా నడిచారు. వెరసి ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యులు రాజీనామాలు చేసినా... వాటిని భర్తీ చేసే పనిని మాత్రం అధిష్ఠానం చేపట్టలేదు. ఖాళీ అయిన పదవులను భర్తీ చేయడం మానేసి... ఏఐసీపీ - వర్కింగ్ కమిటీ - ఇతర జాతీయ స్థాయి విభాగాలతోనే అలా నెట్టుకొచ్చింది. అయితే జాతీయ పార్టీగా - దేశాన్ని సుధీర్ఘ కాలం ఏలిన పార్టీగా కాంగ్రెస్ ఖాళీ అయిన పదవులను ఎంతో కాలం అలాగే ఉంచలేదు కదా. అందుకే కాబోలు... ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ పదవిని ఆ పార్టీ అధిష్ఠానం భర్తీ చేసింది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయమే తీసుకుంది. పార్టీ ఏపీ శాఖ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను నియమించింది.

పార్టీలో పెద్దగా సీనియారిటీ లేని నేతగా సాకేకు పేరుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన సాకే... వైఎస్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా సింగమనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన సాకే... రాష్ట్ర విభజన తర్వాత ఎందుకూ కొరగాకుండా పోయారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఓ రేంజిలో పోరాటం సాగించిన సాకే... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాదిరే పత్తా లేకుండా పోయారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే తెర మీదకు వస్తూ పోతూ సాగిన సాకే... పార్టీ తరఫున ఏదైనా పెద్ద కార్యక్రమం పెడితేనే కనిపించే వారన్న మాట కూడా గట్టిగానే వినిపించింది. ఇటీవలి కాలంలో ఓ మోస్తరుగా బయట కనిపిస్తున్న సాకే... పార్టీ వ్యవహారాలను దక్కించుకునే దిశగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఈ విషయంలో సాకే విజయం సాధించగా... పార్టీ అధిష్ఠానం కూడా ఆయనను ఏపీసీసీ చీఫ్ గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే... గత కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ పదవి అనంతపురం జిల్లాను దాటి వెళ్లడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. సాకేకు ముందు పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డిది కూడా అనంతపురం జిల్లానే కదా. దాదాపుగా ఆరేళ్లకు పైగానే రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా మొక్కవోని దీక్షతో పార్టీ పగ్గాలను రఘువీరా భుజానికెత్తుకున్నారు. అయితే 2019లోనూ 2014 తరహా ఫలితాలే రావడంతో రఘువీరా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తన సొంతూరుకే పరిమితమైన రఘువీరా... ఎంచక్కా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ దఫా కూడా పీసీసీ చీఫ్ పదవి సాకేకు దక్కడం ద్వారా... మరోమారు ఆ పదవి అనంతపురం జిల్లాకే వెళ్లిపోయిందన్న వాదన వినిపిస్తోంది. సాకేకు పీసీసీ చీఫ్ పదవిని కేటాయించిన అధిష్ఠానం... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించింది.