Begin typing your search above and press return to search.

నాయిని రాజకీయాలన్నీ బుల్లెట్‌ బండి పైనే..దానికి కారణం అదే

By:  Tupaki Desk   |   22 Oct 2020 9:30 AM IST
నాయిని రాజకీయాలన్నీ బుల్లెట్‌ బండి పైనే..దానికి కారణం అదే
X
కార్మిక నాయకుడు, ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాయిని నర్సింహారెడ్డి కి బుల్లెట్ అంటే ప్రాణం. ఆయన రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా ఎక్కడికి వెళ్లినా బుల్లెట్ పైనే వెళ్లేవారు. నగరంలోని అన్ని ప్రాంతాలనూ చుట్టేస్తూ ప్రజా సమస్యలను తెలుసు కొనేవారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి నాయిని ముందుడేవారు. బుల్లెట్ పై ఎక్కడికైనా వేగంగా వెళ్లి నిమిషాల్లో సమస్యకు పరిష్కారం చూపించొచ్చు అనేది నాయిని ఉద్దేశం.
నాయిని అంటే టక్కున గుర్తు వచ్చేవి .. గంభీరమైన మీసాలు..

ఆరడుగుల ఆజానుబాహుడు వీటికి తోడు బుల్లెట్‌.. అంతలా ఆ బైక్ కి క్రేజ్ ఉండేది. ప్రజలను కలిసేందుకు వెళ్ళేటప్పుడల్లా ఆయన బుల్లెట్ పై వెళ్తుండటంతో ఆయనకు బుల్లెట్ నర్సన్న అని పేరు పెట్టారు. బుల్లెట్ అంటేనే డిఫరెంట్ బీటింగ్ సొంతం. ఆ సౌండ్ అల్లంత దూరానికి వినిపిస్తుంది. అలా నాయిని ఏదైనా కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఆయన రాక ముందే అందరికీ తెలిసేది. దానికి కారణం బుల్లెట్ సౌండే.

హైదరాబాద్‌ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల నాయిని పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నాయిని ని ముద్దుగా బుల్లెట్‌ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్‌ పైనే వెళ్తారు. వృద్ధాప్యంలో ఉన్నా బుల్లెట్ ను మాత్రం వదిలేవారు కాదు. చివరికి బండి నడిపే ఓపిక తగ్గిపోయాక కూడా సరదాగా ఆయన బండిని బయటకు తీసి దానిని సొంతంగా తుడుచుకునేవారు. నాయిని మీసాల గంభీరానికి, బుల్లెట్ అదిరి పోయే శబ్దానికి కాంబినేషన్ భలే సూట్ అయ్యేది. ఆయనకు బైకే కాదు వాహనాలు అంటే ఏవైనా ఇష్టమే. కొత్త మోడల్ ఏం వచ్చినా నడిపేందుకు ఆసక్తి ప్రదర్శించేవారు.