Begin typing your search above and press return to search.

ఆ రికార్డు నాయినిదే.. ముఖ్యమంత్రినే ఓడించారు

By:  Tupaki Desk   |   22 Oct 2020 10:45 AM IST
ఆ రికార్డు నాయినిదే.. ముఖ్యమంత్రినే ఓడించారు
X
కొన్ని అసాధారణ రికార్డులు కొందరు నేతలకు మాత్రమే సొంతమవుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎన్నికల్లో తలపడటం అంటే మాటలు కాదు. అలాంటిది సదరు సీఎంను ఓడించి సంచలనాన్ని నమోదు చేసిన అరుదైన రికార్డు నాయిని నర్సింహారెడ్డి సొంతం. సీఎంను ఓడించిన నాయిని పేరు తెలుగు రాష్ట్రంలో మారుమోగింది. ఆయన రాజకీయ జీవితంలో సాధించిన అరుదైన విజయాల్లో ఒకటిగా పలువురు చెబుతారు.

1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాయిని అప్పట్లో జనతా పార్టీలో ఉండేవారు. జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన నాయిని.. నాటి ముఖ్యమంత్రి అంజయ్యపై ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ముఖ్యమంత్రిపై పోటీ చేసిన నాయిని గెలుపుపై అప్పట్లో ఎవరికి అంచనాలులేవు. అందుకు భిన్నంగా 3వేల ఓట్ల మోజార్టీతో గెలుపొందిన వైనం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

నాయిని తన కెరీర్ లో పెద్ద నేతలపై పోటీ చేసి గెలిచిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. తాను ఓడిన నేతలపై గెలవటం ఆయన రాజకీయ జీవితంలో కనిపిస్తుంది. 1983లో వీచిన టీడీపీ గాలిలో జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నాయిని.. టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ పై 306 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ పై 10వేల మెజార్టీతో గెలుపొందారు.

1989లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీడీపీలో చేరారు. అప్పట్లో టీడీపీఅభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1994లో మరోసారి కోదండరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 1989లో మిత్రపక్షాల సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ నేతగా ఉన్న నాయినికి బరిలోకి దిగే అవకాశం రాలేదు. ఆయన స్థానంలో మిత్రపక్ష అభ్యర్థిగా బీజేపీకి చెందిన కె.లక్ష్మణ్ పోటీ చేసి గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల నాటికి టీఆర్ఎస్ లో చేరిన నాయిని.. కాంగ్రెస్ పార్టీతో జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా ముషీరాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ పై 247 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

వైఎస్ సర్కారులో విద్యా శాఖామంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో తన పదవికిరాజీనామా చేసిన ఆయన.. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆయనపై మాజీ ముఖ్యమంత్రి.. నాయిని చేతుల్లో ఓడిన అంజయ్య సతీమణి మణెమ్మను బరిలోకి దింపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు నాయిని. ముఖ్యమంత్రిని ఓడించిన నాయిని.. ఆయన సతీమణి చేతలో తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తర్వాతి కాలంలో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయన్ను ఎంపిక చేసి.. హోంమంత్రిని చేశారు కేసీఆర్.