Begin typing your search above and press return to search.

ఆడలేక మద్దెల ఓడు..! ఇండియా పిచ్​లు బాలేవట.. !

By:  Tupaki Desk   |   1 March 2021 7:00 PM IST
ఆడలేక మద్దెల ఓడు..! ఇండియా పిచ్​లు బాలేవట.. !
X
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ మరోసారి మన పిచ్​లపై విమర్శలు చేశాడు. మోతేరా పిచ్​ స్పిన్​కు అనుకూలంగా ఉందని గతంలో ఓ సారి విమర్శలు చేసిన మాంటీ పనేసర్​.. ప్రస్తుతం అహ్మదాబాద్ మోడీ స్టేడియం కూడా అలాగే ఉందంటూ విమర్శలు చేశాడు. ఈ పిచ్​ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందంటూ అతడు కామెంట్లు చేశాడు.

‘టీమిండియా పాయింట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోత విధించాలి. భారత్‌ అద్భుతమైన స్టేడియం నిర్మించింది. అయితే ఇక్కడ మ్యాచ్​లు సుధీర్ఘంగా సాగాలి. అంతేకానీ కేవలం రెండ్రోజుల లోపే మ్యాచ్​ ముగిసిపోవడం సరికాదు. ఈ మ్యాచ్​లు ఇంగ్లండ్​లోని క్లబ్​ మ్యాచ్​లను తలపిస్తున్నాయి. రెండు రోజుల్లో ముగిసే ఆటకు ఓ పార్కులోనో ఆడితే సరిపోతుంది.. అంతేకానీ ఇంతపెద్ద స్టేడియంలో ఎందుకు ఆడాలి. మూడో టెస్టులో ఆట చూశాక అది ఇంగ్లండ్‌లో ఆడే క్లబ్‌ క్రికెట్‌లాగా అనిపించింది. మేం క్లబ్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు ప్రత్యర్థిని 100 పరుగుల్లోపే ఆలౌట్‌ చేస్తాం’ అని ఆయన పేర్కొన్నాడు.

భారత్ పడగొట్టిన 20 వికెట్లలో 19 స్పిన్నర్లే తీశారు. అక్షర్ 11, అశ్విన్ 7, సుందర్ 1 వికెట్ పడగొట్టాడు. పేసర్ ఇషాంత్ ఒక వికెట్ తీశాడు.

900 బంతుల్లోనే టెస్టు ముగియడం సరికాదు. అంటూ చురకలు వేశాడు. మన స్పిన్నర్ల దాటిని ఇంగ్లాండ్​ ఆటగాళ్లు తట్టుకోలేపోతున్నారని క్రికెట్​ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో పనేసర్​ విచిత్రమైన విశ్లేషణ చేశాడు.