Begin typing your search above and press return to search.

గుళ్లోపూజ చేస్తూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:45 AM IST
గుళ్లోపూజ చేస్తూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే
X
తనకు మించినోడు అని విర్రవీగే మనిషి ఎంత పరిమితమైన వ్యక్తో అప్పుడప్పుడు చోటు చేసుకునే వివిధ పరిణామాలు గుర్తు చేస్తుంటాయి. అప్పటివరకు బాగుండి.. చలాకీగా ఉండే వారు.. అకస్మాత్తుగా కన్నుమూసే షాకింగ్ పరిణామాలు తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మనిషి జీవితం క్షణ భంగురంగా అభివర్ణించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం చూసినంతనే షాక్ కలుగక మానదు.

మధ్యప్రదేశ్ లోని బైతూల్ మాజీ ఎమ్మెల్యే వినోదా డాగా. తాజాగా ఆయన పూజలు చేసేందుకు గుడిలోకి వెళ్లి.. అక్కడే కన్నుమూసిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. థన్ తేరస్ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ట్రెజరర్ వినోదా డాగా.. దాదావాడీలోని ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు.

గుళ్లో ప్రదక్షిణాలు చేసి.. పూజలు చేశారు. దాదా గురుదేవ్ పాదాలకు మోకరిల్లిన ఆయన పక్కకు కదిలే లోపు కొన్ని సెకన్లవ్యవధిలోనే కింద పడిన ఆయన.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో గుళ్లోకి వచ్చిన ఒక బాలుడు.. మాజీ ఎమ్మెల్యే కింద పడి ఉండటాన్ని గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మరణం ఏ మాత్రం జీర్ణించుకోలేనిదిగా మారిందంటున్నారు.