Begin typing your search above and press return to search.

500 సార్లు క్ష‌మించండి అని రాయించిన పోలీసులు

By:  Tupaki Desk   |   12 April 2020 8:36 AM GMT
500 సార్లు క్ష‌మించండి అని రాయించిన పోలీసులు
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తికి మందు లేదు.. నివార‌ణ మాత్ర‌మే చేయ‌గ‌లం. దానికి ఉన్న మార్గాల‌ను పాటించండి.. ఆరోగ్యంగా ఉండ‌డం అని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఈ సంద‌ర్భంగా క‌రోనా రాకుండా ముందు జాగ్ర‌త్త‌గా లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించాల‌ని - బ‌య‌ట‌కు అస్స‌లు రావొద్ద‌ని సూచ‌న‌లు చేస్తున్నా ప్ర‌జ‌ల్లో మార్పు రావ‌డం లేదు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి బ‌య‌ట‌కు అవ‌న‌స‌రంగా వ‌స్తున్నారు. అలాంటి వారికి పోలీసులు బుద్ధి చెబుతున్నారు. వినూత్న రీతిలో శిక్ష‌లు విధిస్తూ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే అది ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ఉండే. కానీ ఇప్పుడు విదేశీయుల‌ను కూడా శిక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించిన విదేశీయుల‌ను పోలీసులు వినూత్న రీతిలో శిక్షించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌ లోని రిషికేశ్‌ లో ఏప్రిల్ 11వ తేదీ శ‌నివారం ప‌ది మంది ఇజ్రాయెల్‌ - మెక్సికో - ఆస్ట్రేలియా - ఇత‌ర యూరోపియ‌న్ దేశాలకు చెందిన‌వారు లాక్‌ డౌన్ ఆంక్ష‌ల‌ను బేఖాత‌రు చేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. భౌతిక దూరం పాటించ‌కుండా గుంపుగా తిరుగుతున్నారు. దీంతో పాటు గంగా న‌దిలో విహ‌రిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో వారికి వినూత్న రీతిలో శిక్ష విధించారు. "నేను లాక్‌ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాను, అందుకు క్ష‌మించండి" అని వారితో ఏకంగా 500 సార్లు పేప‌ర్‌పై పెన్నుతో రాయించారు.

మొద‌టిసారి కాబ‌ట్టి ఇలాంటి చిన్న శిక్ష‌తో వ‌దిలేస్తున్నామ‌ని - మ‌రోసారి ఇలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని అక్క‌డి పోలీసులు హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు కూడా నిబంధ‌న‌లు పాటించి ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు.