Begin typing your search above and press return to search.

రెండు సీట్ల కోసం.. వైసీపీలో పోటా పోటీ!

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:00 PM IST
రెండు సీట్ల కోసం.. వైసీపీలో పోటా పోటీ!
X
ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల భ‌ర్తీకి రంగం సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. మొత్తం మూడు స్థానాల‌ను భ‌ర్తీ చేయా ల్సి ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఏపీలో మొత్తం ముగ్గురికి సంబంధించి ప‌ద‌వుల కాలం అయిపోయింది. వీరిలో బీజేపీ నాయ‌కుడు.. సోము వీర్రాజు కూడా ఉన్నారు. మ‌రొక‌రు వైసీపీకే చెందిన గోవింద‌రెడ్డి ఉన్నారు. టీడీపీకి చెందిన మ‌హ్మ‌ద్ ష‌రీఫ్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌యింది. వీరిలో గోవింద‌రెడ్డికి తిరిగి ఇవ్వ‌నున్న వైసీపీ అధిష్టానం.. మ‌రో ఇద్ద‌రి కోసం ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభించింది.

ప్ర‌స్తుతం ఈ రెండు ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు మూడు జిల్లాల నుంచి ఏడుగురు నాయ‌కులు ప్ర‌య త్నిస్తున్నారు. వీరిలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. కీల‌కంగా ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. క‌ర్నూలు జిల్లా మాజీ ఎంపీ.. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళా నేత‌.. బుట్టా రేణుక కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, విజ‌య‌వాడ నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి కూడా తాడేప‌ల్లికి లేఖ పంపారు. అదేస‌మ‌యంలో తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, క‌డ‌ప నుంచి కూడా నాయ‌కులు క్యూక‌ట్టారు.

అయితే.. వీరిలో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు.. పార్టీలో ఈ రెండు ప‌ద‌వుల‌ను ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌స్తావ‌న వ‌స్తోంది. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కే ఈ రెండు సీట్ల‌ను కేటాయిస్తార‌ని.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ స్థానిక సంస్థ‌ల కోటాలో వ‌చ్చే 14 సీట్ల‌ను ఆశావ‌హుల‌కు కేటాయిస్తార‌ని అంటున్నారు. కానీ..ఇది జ‌రిగే నాటికే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న పూర్త‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. దీంతో త‌మ‌కు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పిస్తామ‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన పార్టీ.. ఇప్పుటికీ ప‌ట్టించుకోక‌పోతే.. ఎలా..? అనే అస‌హ‌నం.. అసంతృప్తి.. కొంద‌రిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

దీంతో ఈ రెండు సీట్ల‌కు పోటీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎవ‌రూ తాడేప‌ల్లికి రావొద్దని.. ఏదైనా ఉంటే.. పార్టీ కి అభ్య‌ర్థ‌న‌లు పంపుకోవ‌చ్చ‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ వ్యూహం వెనుక‌.. కేవ‌లం నాయ‌కులను సంతృప్తి ప‌ర‌చడం అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. సామాజిక వ‌ర్గాల వారీగా.. ముందుకు వెళ్లాల‌నే ప్ర‌య‌త్నం.. సామాజిక వ‌ర్గాల‌ను త‌మ‌వైపు తిప్పుకోనే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది వివాదంగా మారుతుందా.? లేక‌.. స‌మ‌సిపోయి.. అధిష్టానం చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా చూడాలి.