Begin typing your search above and press return to search.

కువైట్‌లో ఉద్యోగం.. భారీ జీతం ఇక కుద‌ర‌దు.. ఎందుకంటే!

By:  Tupaki Desk   |   7 Sep 2021 4:45 PM GMT
కువైట్‌లో ఉద్యోగం.. భారీ జీతం ఇక కుద‌ర‌దు.. ఎందుకంటే!
X
సాధార‌ణంగా.. భార‌త్ నుంచి ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లే వారి ల‌క్ష్యం.. ఒక్క‌టే.. ఇక్క‌డ చేసే ప‌నికి త‌క్కువ వేతనం ల‌భిస్తుంది.. అదే విదేశాల్లో అందునా.. గ‌ల్ఫ్ దేశాల్లో అయితే..ఇదే ప‌నికి భారీ వేత‌నం ల‌భిస్తుంది. అందుకే.. ఏమాత్రం నైపుణ్యం ఉన్నా.. వెంట‌నే గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లి.. అక్క‌డో ప‌దిరాళ్లు సంపాయించుకుని.. వ‌స్తారు. అయితే.. ఇప్పుడు ఇలాంటి వ్యూహాల‌కు.. భారీ మొత్తంలో వేత‌నం తీసుకునేవారికి గల్ఫ్ దేశ‌మైన కువైట్ చెక్ పెట్ట‌బోతోంది. రాబోయే రోజుల్లో భారీ వేత‌న రాయుళ్ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించింది. మ‌రీ ముఖ్యంగా ఇత‌ర దేశాల నుంచి కువైట్ వ‌చ్చి.. భారీ స్థాయిలో వేత‌నం అందుకుంటున్న వారికి కోత‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది.

ఎందుకంటే..!
క‌రోనా నేప‌థ్యంలో అన్ని దేశాల ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ క్ర‌మంలో కువైట్‌లోనూ ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌లేదు. దీంతో అక్క‌డ ప‌నిచేసే సొంత ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌లు పెట్టారు.కానీ, విదేశాల నుంచి వ‌చ్చిన వారికి ప్రైవేటు సెక్టార్‌లో వేత‌నం మామూలుగానే ఉంది. ఈ నేప‌థ్యంలో విదేశీయుల‌కు వేత‌నాలు త‌గ్గించ‌న‌ప్పుడు.. మాకెందుకు తగ్గిస్తారంటూ.. కొంద‌రు ఫిర్యాదులు చేశారు. దీంతో కువైట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. దీనికితోడు.. కువైటైజేషన్‌లో భాగంగా ఇప్పటికే ప్రవాస ఉద్యోగుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రవాసుల రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణ విషయాలలో గత కొన్నాళ్లుగా కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.

ఏం జ‌రుగుతుంది?
ప్రవాస ఉద్యోగులు ఎవరైతే భారీ మొత్తంలో జీతాలు అందుకుంటున్నారో వారికి వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదనే ఆలోచ‌న‌లో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించాలని చూస్తోంది. ప్రైవేట్ సెక్టార్‌లో అధిక సంఖ్యలో దేశీయ కార్మికులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కువైత్ ఈ ఆలోచన చేస్తుందట. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ సెక్టార్‌లో రాబోయే రెండేళ్లలో సుమారు 12 వేల మంది దేశ పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని మానవ వనరుల విభాగంలోని జాతీయ కార్మిక వ్యవహారాల శాఖ అధికారి సుల్తాన్ అల్ షలానీ తెలిపారు.

ఉండేందుకూ ఇబ్బందేనా?
మ‌రోవైపు.. 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ విషయంలో కువైట్ పలు కీలక మార్పులు చేసింది. మొదట యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు రెసిడెన్సీ పర్మిట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఆ తర్వాత రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు ఏకంగా 2వేల కువైటీ దినార్లు(రూ.4.87లక్షలు) చెల్లించాల్సిందిగా పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత రావడంతో రెన్యువల్ ఫీజును వెయ్యి కువైటీ దినార్లకు(రూ.2.43లక్షలు) తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ 500 దినార్లుగా పేర్కొంది.