Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వరద బాధితులకు ముందు రూ.10వేలు.. తర్వాత అంత ఇస్తారా?

By:  Tupaki Desk   |   21 Oct 2020 5:40 PM IST
హైదరాబాద్ వరద బాధితులకు ముందు రూ.10వేలు.. తర్వాత అంత ఇస్తారా?
X
దాదాపు వందేళ్ల తర్వాత చోటు చేసుకున్న భారీ వరదల కారణంగా హైదరాబాద్ మహానగరం దారుణంగా ప్రభావితమైంది. లక్షల కుటుంబాలు నీట మునగటమే కాదు.. తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఇటీవల కాలంలో విపత్తులు విరుచుకుపడినా.. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. అందుకు భిన్నంగా ఒక్క హైదరాబాద్ లోనే వర్షం.. వరదల కారణంగా 30 మందికి పైనే మరణించటం దేనికి నిదర్శనం?

గతంలో వర్షాలు.. వరదలు చోటు చేసుకున్నప్పుడు.. హైదరాబాద్ లో ప్రభావితమయ్యే ప్రాంతాలు బస్తీలు..కాలనీలు. అందుకు భిన్నంగా తాజా విపత్తులో సంపన్నులు.. మధ్య తరగతి.. ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో చోటు చేసుకోవటం గమనార్హం. చెరువుల్ని ఆక్రమించేయటం.. నాలాల్ని కబ్జా చేసేయటం లాంటి వాటితో తాజా దారుణానికి కారణమైందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. వరద కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పెద్ద ఎత్తున పరిహారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

ఆయన ఆదేశాలతో తాజాగా హైదరాబాద్ మహానగరంలోని వర్షం.. వరద బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.10వేలు క్యాష్ ను నేరుగా అందిస్తున్నారు. ఒక విపత్తు వేళ.. ఇంత భారీగా నగదు సాయం అందించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అంతేకాదు..ఈ పదివేల సాయం వంద మందికో.. వెయ్యి మందికో కాకుండా దగ్గర దగ్గర 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించటం గమనార్హం.

తొలుత వరద బాధితుల వద్దకు వెళ్లి.. వారి వివరాలు తెలుసుకోవటంతో పాటు.. వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తారు. వారికి జరిగిన నష్టాన్ని మదింపుచేసి నివేదిక తయారు చేస్తారు. దీని ప్రకారం పాక్షికంగా నష్టపోతే రూ.50వేలు.. గోడలు కూలి.. మరింత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటే.. రూ.లక్ష వరకు సాయం అందించాలని నిర్ణయించారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో బాధితులకు తక్షణ సాయం కింద రూ.10వేలు.. రానున్న రెండు వారాల వ్యవధిలో వారికి జరిగిన నష్టానికి తగ్గట్లు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఇప్పటికే వరద తిప్పలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. అంతో ఇంతో సానుకూలంగా స్పందించటం ఖాయమంటున్నారు.