Begin typing your search above and press return to search.

దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు మొదలు

By:  Tupaki Desk   |   17 Dec 2020 9:00 AM IST
దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే  ఐదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు మొదలు
X
రానున్న సంవత్సరం రాజకీయ సంచలనాలకు నెలవుగా మారనుంది. 2021 తొలి అర్థభాగంలోనే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే వీలున్న ఈ రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని పరిశీలించేందుకు సీనియర్ అధికారుల్ని పంపి.. నివేదికల్నితీసుకోనున్నారు.

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్ లో పాటు.. దక్షిణాదిన కీలకమైన తమిళనాడు.. కేరళ రాష్ట్రాలతో పాటు.. పుదుచ్చేరిలతో పాటు ఈశాన్యాన అసోం అసెంబ్లీ గడువు ఏప్రిల్ - జూన్ మధ్యన గడువు తీరనుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? రెండు నెలల వ్యవధిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పశ్చిమబెంగాల్ లో ఈసారి తన అధిక్యతను ప్రదర్శించి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కమలనాథులకు అవకాశం ఇవ్వకూడదని దీదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిన కీలకమైన రాష్ట్రంగా చెప్పే తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమంటే.. చాలా ఏళ్ల తర్వాత కరుణ.. జయలలిత లేని అసెంబ్లీ పోరును చూడనున్నాం. మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయటం.. రజనీ.. కమల్ లు అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా పావులు కదుపుతున్నారు.ఈసారి ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణలన్నింటిని మార్చేయటమే కాదు.. భవిష్యత్తు రాజకీయాలు ఏ రీతిలో ఉండనున్నాయన్న విషయంపై స్పష్టత రానుంది.

కేరళ.. పుదుచ్చేరి.. అసోంలో ఎన్నికలు పోటాపోటీగా సాగినా.. వాటి ఫలితాలు పెద్ద ఆసక్తిని కలిగించే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం.. తన ప్రతినిధుల్ని పంపుతోంది. అక్కడి ఎన్నికలకు ఉన్న అవకాశాలు.. తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరా తీయనుంది. ఏమైనా.. వచ్చే ఏడాది మొదట్లోనే.. ఈ ఎన్నికల వేడి దేశాన్నిచుట్టేయనుందని చెప్పక తప్పదు.