Begin typing your search above and press return to search.

పండుగ పూట వనపర్తి జిల్లాలో దారుణం.. ఇల్లు కూలి ఐదుగురు మరణం

By:  Tupaki Desk   |   25 Oct 2020 10:40 AM IST
పండుగ పూట వనపర్తి జిల్లాలో దారుణం.. ఇల్లు కూలి ఐదుగురు మరణం
X
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. దాదాపు పది రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగర శివారులో అర్థరాత్రి వేళ.. పక్కనే ఉన్న భారీ ప్రహరీగోడ కూలిన ఉదంతంలో.. ఆ పక్కనే ఉన్న ఇంట్లోని తొమ్మిది మంది దుర్మరణం పాలు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎలాంటి వర్షం లేకుండానే..శనివారం రాత్రి వనపర్తి జిల్లా బుద్ధారంలో తాజా దారుణం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం మరణించారు. ఆయన సతీమణి మణెమ్మ ఊర్లోనే ఉండగా.. పిల్లలు మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కావటంతో ఊరికి వచ్చారు. ఎప్పటిలానే రాత్రి వేళలో భోజనం ముగించుకొని.. ఒకే గదిలో తొమ్మిది మంది నిద్రిస్తున్నారు. ఇలాంటివేళ.. హటాత్తుగా ఇంట్లోని ఒక భాగం కూలింది.

కూలిన గదిలో పడుకున్న మణెమ్మతో పాటు.. ఆమె ఇద్దరు కోడళ్లు.. ఇద్దరు మనమరాళ్లు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని షురూ చేశారు. పండుగవేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదం అమాయకులైన ఐదుగురి ఊసురు తీయటం తీవ్ర విషాదంగా మారింది.