Begin typing your search above and press return to search.

అక్బ‌రుద్దీన్ హ‌త్యాయ‌త్నం కేసు...తీర్పు!

By:  Tupaki Desk   |   29 Jun 2017 1:01 PM GMT
అక్బ‌రుద్దీన్ హ‌త్యాయ‌త్నం కేసు...తీర్పు!
X
ఎంఐఎం శాసన సభాపక్ష నేత - చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై 2011లో జ‌రిగిన‌ హత్యాయత్నం ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో న‌లుగురిని నాంపల్లిలోని 7వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ పహిల్వాన్‌ ను న్యాయ‌స్థానం నిర్దోషిగా ప్రకటించింది. హసన్‌(ఏ2) - అబ్దుల్లా(ఏ3) - వాహిద్‌(ఏ5) - వహ్లాన్‌(ఏ12)లను దోషులుగా నిర్ధారించింది.

ఆ న‌లుగురు దోషుల‌కు ప‌దేళ్ల‌పాటు శిక్ష విధించింది. ఇప్ప‌టికే వారు అనుభ‌వించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని మినహాయించింది. వీరికి న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదు కాగా.. మహ్మద్‌ పహిల్వాన్‌ సహా 10 మంది నిర్దోషులుగా బయటపడ్డారు.

2011 ఏప్రిల్‌ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌ కు తీవ్ర గాయాలు కాగా, దాడికి పాల్పడ్డ ఇబ్రహీం బిన్‌ యూనుస్‌ యాఫై (25) ... అక్బ‌రుద్దీన్ గన్‌ మెన్‌ కాల్పుల్లో మరణించాడు.

ఈ కేసులో మొత్తం 15 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌ లో కేసు నమోదైంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును సీసీఎస్‌ కు బదిలీ చేశారు. సీసీఎస్‌ పోలీసులు వేగంగా పరిశోధించి నిందితులపై అభియోగాలు నమోదు చేశారు.

నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో అక్బరుద్దీన్‌ ఒవైసీపై దాడికేసు విచారణ ఆరేళ్ల నుంచి కొనసాగుతోంది. బెయిలు లేకుండా నిందితుల్లో పలువురు జైలుకే పరిమితం అయ్యారు. ఈ కేసులో మొత్తం 86 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. గత నెలలోనే విచారణ పూర్తయింది. ఇవాళ తుది తీర్పు నేపథ్యంలో... అటు పహిల్వాన్ గ్యాంగ్ - ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కోర్టుకు వచ్చారు. నాంప‌ల్లి - పాతబస్తీలో పోలీసులు ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/