Begin typing your search above and press return to search.

బాబుకు చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు

By:  Tupaki Desk   |   23 May 2017 9:20 AM GMT
బాబుకు చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు
X
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గోల మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తగాదాలు ఆయనకు తలనొప్పులు తెస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చిన గొట్టి పాటి రవి - టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గాల మధ్య రచ్చ నిత్యం రావణ కాష్ఠంలా రగులుతోంది. రీసెంటుగా అక్కడ జరిగిన జంట హత్యల గొడవ ఆగకముందే అదే నేపథ్యంలో ఈ రెండు వర్గాలు మంత్రుల ముందే మరోసారి తన్నుకున్నంత పని చేశాయి.

మంగళవారం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం - ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ - సునీత - శిద్ధా రాఘవరావుల సమక్షంలోనే వైరివర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.

ఇటీవల వేమవరంలో చోటుచేసుకున్న జంటహత్యలు.. గొట్టిపాటి రవికుమారే చేయించారని కరణం వర్గీయులు నినదించారు. ఆ వెంటనే గొట్టిపాటి అనుచరులు.. కరణం వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరుపక్షాలమధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఎంత వారించినా కార్యకర్తలు వినకపోవడంతో మంత్రులు సహా ముఖ్యనేతలంతా ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహించారు.

అయితే... మంత్రులు వెంటనే సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేయగా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక ఆ ఇద్దరితో వేగలేకపోతున్నానని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ గొడవలను ఎలా సద్దుమణచాలనే విషయంలో ఆయన త్వరలో సీనియర్ నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.