Begin typing your search above and press return to search.

ఆఫర్లు - డిస్కౌంట్లుకు పడిపోకండి.. బుక్కైపోతారు?

By:  Tupaki Desk   |   24 Oct 2020 9:00 AM IST
ఆఫర్లు - డిస్కౌంట్లుకు పడిపోకండి..  బుక్కైపోతారు?
X
దసరా ఆఫర్​.. 90 శాతం డిస్కౌంట్​, 80 శాతం డిస్కౌంట్​ కేవలం 24 గంటలు మాత్రమే ఉంది.. త్వరపడండి లేదంటే బంగారం లాంటి అవకాశాన్ని మిస్సైపోతారు. అంటూ ఆన్​లైన్​ సంస్థలు ఊదరగోడుతున్నాయి. అయితే ఇటువంటి డిస్కౌంట్లు చూసి టెంప్ట్​ కావొద్దని.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీకు అవసరం అనిపిస్తేనే ఆ వస్తువును కొనుగోలు చేయాలని.. అనవసరంగా కొనుగోళ్లు జరిపి డబ్బులు వృథా చేసుకోవద్దని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి ఆన్‌ లైన్ ఈ-కామర్స్ వేదికలు దసరా ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు అన్నింటిపైనా భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. కార్టులపై ప్రత్యేక డిస్కౌంట్లు, జీరో ఇంట్రెస్ట్ ఇన్‌స్టాల్‌ మెంట్ ఆఫర్లను ఈ-కామర్స్ సైట్లు అందిస్తున్నాయి.

యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జీ ఉత్పత్తులపైనా భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. ఈ ఆఫర్లను ఎంతవరకు నమ్మొచ్చా.. తెలుసుకుందాం..
ఆఫర్లతో వినియోగదారులకు లాభం ఎంతో తెలియదు కానీ కంపెనీలు మాత్రం లాభపడుతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత భారీ సేల్స్​ తాము చూశామని అమేజాన్​ తెలిపింది. 20 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు అంటున్న ప్రకటనలపై నిజమెంతో తెలుసుకుందాం.. ‘డిస్కౌంట్లు ఇచ్చే మాట వాస్తవమే. అయితే, ఇందులో చాలా మతలబులు ఉంటాయి. ముందుగా వస్తువు ధరను భారీగా పెంచడం.. ఆ తర్వాత డిస్కౌంట్ రూపంలో తగ్గించడం మామూలేనని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు డెల్ ఇన్‌స్పిరాన్ 15.6 అనే ల్యాప్​టాప్​ ధరను ఒక రోజులోనే లిస్ట్ ప్రైజ్ 120 డాలర్లు పెంచారు. తర్వాత 30 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. అంటే మనకు వచ్చింది 10 శాతం మాత్రమే. ఇలా అన్ని వస్తువులపైనా ఇదే తరహాలో చేస్తున్నారు. లిస్ట్​ ప్రైజ్​ను పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. 'కొన్నిసార్లు ఇంత మొత్తం కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని చెబుతారు.. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి దీనిలో లాభం చేకూరొచ్చు. కానీ స్వల్ప మొత్తాల్లో కొనుగోలు చేసేవారికి దీనితో చేటు జరిగే అవకాశముంది. ప్రజలు డిస్కౌంట్లు, ఆఫర్ల హోరులో కొట్టుకుపోకుండా వస్తువు గత ధరను పోల్చి చూసుకొని అవసరం అనుకుంటేనే కొనుగోలు చేయడం మేలని నిపుణులు చెబుతున్నారు.