Begin typing your search above and press return to search.

విద్య ఇక వ్యాపారం కాదు : ఏపీలో ఫీజుల ఖరారు !

By:  Tupaki Desk   |   25 Aug 2021 12:00 PM IST
విద్య ఇక వ్యాపారం కాదు : ఏపీలో ఫీజుల ఖరారు !
X
చదువు .. ప్రస్తుత రోజుల్లో ఓ వ్యాపారం. చదువు భావి తరాలకి భరోసాని ఇచ్చే అతి పెద్ద ఆస్తి. కానీ, ప్రస్తుతం దాన్ని వ్యాపారం చేశారు. గత కొన్ని రోజులుగా మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫీజుల్ని నియంత్రిస్తూ, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం టెన్త్ క్లాస్ కి గరిష్ట ఫీజు హాస్టల్ తో కలిపి రూ.42వేలు. ఇంటర్ కి గరిష్ట ఫీజు హాస్టల్, నీట్ కోచింగ్ తో కలిపి రూ. 64వేలు.

ఇప్పటి వరకు దీనికి నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ప్రకటనతో షాక్ అయ్యాయి. ఏపీలో టెన్త్, ఇంటర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలే ఇందులో చాలా ఉన్నాయి. అయితే అడ్డగోలుగా ఫీజులు పెంచుకోడానికి, దానికి వేరే పేర్లు పెట్టుకోడానికి అవకాశం లేకుండా చేసింది. పీ పాఠ‌శాల విద్య నియంత్ర‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిష‌న్ సిఫార‌సును ఆమోదిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బి.రాజ‌శేఖ‌ర్ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గ్రామ పంచాయతీల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో సైన్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజుగా నిర్ణయించారు. ఆర్ట్స్ గ్రూపులకు రూ.12 వేలు ఫీజు నిర్ణయించారు. పురపాలక సంఘాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.17,500, ఆర్ట్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.20 వేలు, ఆర్ట్స్ గ్రూపులకు రూ.18 వేలు ఫీజుగా నిర్ణయించారు. ట్యూష‌న్, ప్రాస్పెక్ట‌స్‌, రిజిస్ట్రేష‌న్, ప్ర‌వేశం,ప‌రీక్ష‌, లేబొరేట‌రీ, క్రీడ‌లు, కంప్యూట‌ర్ ల్యాబ్‌, గ్రంథాల‌యం, అద‌న‌పు బోధ‌నా కార్య‌క‌లాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం, స్ట‌డీటూర్‌, అల్యూమ్ని, ఇత‌ర విద్యాసంబంధ రుసుముల‌న్నీ ఇందులోనే క‌లిసి ఉంటాయ‌ని పేర్కొంది.

ఒకవేళ విద్యార్థి ఎంచుకుంటే.. అద‌నంగా ర‌వాణా, వ‌స‌తి త‌దిత‌ర రుసుములు తీసుకోవ‌చ్చు. ర‌వాణా రుసుముల‌కు సంబంధించి కిలో మీట‌రుకు రూ.1.20 చొప్పున తీసుకోవాల‌ని, వ‌స‌తి గృహాల్లో ఉండే వారైతే.. ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని క‌ళాశాల‌ల్లో రూ.18వేలు, పుర‌పాలక సంఘాల్లోని వాటికి రూ.20వేలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల్లో ఉంటే రూ.24వేల‌కు మించ‌కూడ‌దు. - వ‌సూలు చేసే ఫీజుల‌కు సంబంధించిన ర‌సీదుల‌ను వెబ్‌సైట్‌ లో ఉంచాలి. ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాల‌తో కూడిన ఆర్థిక నివేదిక‌ల‌ను బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శించాలి. ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొందుప‌ర‌చాలి.

హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇలా రకరకాల పేర్లతో ఏపీలో టెన్త్ ఫీజు లక్ష రూపాయల గరిష్ట స్థాయిని ఎప్పుడో దాటేసింది. కానీ ఇప్పుడది రూ.24వేలకు పరిమితం కావాల్సి వస్తోంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో 10వేల రూపాయలు, పట్టణాల్లో 11వేలు, నగరాల్లో 12వేలుగా ఫీజులు నిర్ణయించారు. 6నుంచి 10 తరగతి వరకు గ్రామాల్లో 12వేల రూపాయలు, పట్టణాల్లో 15వేలు, నగరాల్లో 18వేలుగా ఫీజు నిర్ణయించారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఫీజులపై నియంత్రణ విధించినా, స్పెషల్ పర్మిషన్ల పేరుతో గేట్లు ఎత్తేశాయి.

ఇక ఇదిలా ఉంటే , కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడిన 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా.. 2021-22 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 పని దినాలు ఉండనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ చివరి పనిదినంగా నిర్ణయించారు. పాఠశాలల ప్రారంభానికి ముందు 1 గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత 1 గంటా 15 నిమిషాలు పెంచి ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలు చేశారు. పెంచిన ఈ 3 గంటల సమయాన్ని పాఠ్యాంశాల బోధన, విరామం, ఇతర కార్యక్రమాలకు వినియోగించనున్నారు. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు(పీపీ-1,2) ఉదయం 9.05 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పని చేయనున్నాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి.

ఇక పండగ సెలవుల విషయానికొస్తే.. ఇలా ఉన్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. అలాగే దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్ (మిషనరీ బడులకు) డిసెంబర్ 23-30 వరకు సెలవులు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, ఉగాది ఏప్రిల్ 2న సెలవు ఇవ్వనున్నారు. పరీక్షలకు సంబంధించి వివరాల్లోకెళ్తే.. 6-10 తరగతుల విద్యార్ధులకు సమ్మెటివ్-1 పరీక్షలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు జరగనుండగా.. 6-9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 29 వరకు జరుగుతాయి. ఇక సెప్టెంబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు.