Begin typing your search above and press return to search.

వీడు నాన్నేంది.. ముగ్గురు పిల్లల్ని చంపేశాడు

By:  Tupaki Desk   |   7 March 2020 6:29 AM GMT
వీడు నాన్నేంది.. ముగ్గురు పిల్లల్ని చంపేశాడు
X
నాన్నంటే కంటికి రెప్పలా కాపాడేటోడు. పిల్లలకు కష్టం కలగకుండా ఉండేందుకు తనను తాను ఆత్మాహుతి చేసుకునేందుకు సైతం వెనకాడనోడు. పిల్లల కోసం ఎంతకైనా తెగించేటోడు. పిల్లల మోములో నవ్వులు చిందాలని.. అందుకోసం ఎంతటి శ్రమకైనా.. మరెంతటి త్యాగానికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించేటోడు. మరి.. అలాంటిది.. నాన్న పేరుకు మచ్చ తెచ్చేలా చేసిన ఈ నరరూప రాక్షసుడ్ని మాట వరసకు సైతం నాన్న అని పిలిచినా.. పలుచన చేసినట్లే.

బాధ్యత అన్నది లేకుండా నిత్యం తాగుతూ.. జూదం ఆడుతూ.. కష్టపడి పని చేసి సంపాదించే డబ్బులతో జీవితాన్ని గడిపేసే దుర్మార్గుడు ఒకడు చేసిన దుర్మార్గం కంటతడి పెట్టేలా చేయటమే కాదు.. ఇలాంటి ఆరాచకానికి పాల్పడిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్న ఆగ్రహం కలుగక మానదు. నలుగురి పిల్లల్లో ముగ్గురు పిల్లల్ని తెలిసిన వారింట విందుకని తీసుకెళ్లి.. చెరువులో ముంచేసి అత్యంత కిరాతకంగా చంపేసిన రాక్షసుడి ఉదంతమిది. తన కష్టాన్ని దోచుకుంటున్నాడని... బాధ్యతను మరిచి మద్యానికి బానిస అయ్యాడంటూ పోలీసులు ఫిర్యాదు చేసిందన్న అ కసితో ముగ్గురుకన్నబిడ్డల్ని చెరువులో ముంచేసి ఊపిరి ఆడకుండా చేసిన దారుణం గురించి విన్నంతనే కంటతడికి లోను కావటం ఖాయం.

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఫయాజ్.. నీలోఫర్ లకు నలుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తె.. కుమారుడు పుడితే.. కొడుకును పుట్టినప్పుడే రూ.50వేలకు అమ్మేసిన ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నలుగురు కుమార్తెలు (10..9..7..6 వయసు)ఉన్నారు. ఏ పని చేయని ఫయాజ్ పేకాట.. మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. అతడి వేధింపుల్ని భరించలేని భార్య తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను.. పిల్లల్ని చంపేసేలా ఉన్నాడని.. తనను రక్షించాలని వేడుకుంది.

దీంతో కోపం పెంచుకున్న ఫయాజ్.. బంధువుల విందుకు వెళుతున్నానంటూ.. ముగ్గురు పిల్లల్ని వెంట తీసుకెళ్లాడు. చెరువులో స్నానం చేద్దామని అబద్ధం చెప్పి.. నీటిలో వారిని ముంచేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. తర్వాత ఏమీ తెలీకుండా తడి బట్టలతో ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించకపోవటంతో భార్య వారి కోసం వెతకటం మొదలు పెట్టింది. చెరువు సమీపంలో పిల్లల బట్టలు.. చెప్పలు కనిపించటం అనుమానం వచ్చి చెరువులో గాలించగా.. పిల్లల డెడ్ బాడీస్ కనిపించాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు.. బంధువులు ఫయాజ్ మీద దాడి చేసే ప్రయత్నం చేయగా పారిపోయి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. పిల్లల్ని తానెలా చంపింది పోలీసులకు చెప్పేశాడు. ఈ అమానవీయ ఘటన అందరికి కదిలించి వేసింది.