Begin typing your search above and press return to search.

6 నెలల సరుకులతో .. 12 వేల ట్రాక్టర్లతో ఢిల్లీని ఢీ కొట్టడానికి బయల్దేరిన రైతులు!

By:  Tupaki Desk   |   12 Dec 2020 9:02 AM GMT
6 నెలల సరుకులతో .. 12 వేల  ట్రాక్టర్లతో ఢిల్లీని ఢీ కొట్టడానికి బయల్దేరిన రైతులు!
X
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రైతుల ఆందోలన 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి రైతులను చర్చలకు కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని ఆపి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞ‌ప్తి చేశారు. అనుమానాలను పక్కనబెట్టి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దని మంత్రి కోరారు. తోమర్ వ్యాఖ్యలపై రైతు సంఘాలు స్పందిస్తూ ... రైతులతో చర్చలు జరపాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే అధికారికంగా చెప్పాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్ అన్నారు.

అలాగే ఆ మూడు చట్టాలు రద్దు మినహా మరే షరతులకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. తమతో చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరపాలనుకుంటున్నారో రైతులకు చెప్పాలన్నారు. గతంలో జరిగిన చర్చలకు అధికారికంగానే ఆహ్వానించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లు దిగ్బంధిస్తామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు, ఉద్యమానికి మద్దతుగా 50వేల మందికిపైగా రైతులు 12 వేల ట్రాక్టర్లతో పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

ఆరు నెలలకు సరిపడా సామాగ్రితో రైతులు ఢిల్లీ బయలుదేరినట్టు మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. చావోరేవో తేల్చుకోడానికే ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గము కాబట్టి మమ్మల్ని ఎలా చంపాలో మోదీ ప్రభుత్వం నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. పంజాబ్, హరియాణాల నుంచి వేలాదిగా తరలివస్తున్న రైతులు సింఘు సరిహద్దు వద్ద డిసెంబరు 12 సాయంత్రం కలుసుకోనున్నారు.