Begin typing your search above and press return to search.

ఐపీఎల్లో ఒక జట్టు ఆటగాళ్ళు..మరో జట్టుకు ఆడే ఛాన్స్!

By:  Tupaki Desk   |   7 Oct 2020 12:00 PM IST
ఐపీఎల్లో ఒక జట్టు ఆటగాళ్ళు..మరో జట్టుకు ఆడే ఛాన్స్!
X
యూఏఈ వేదికగా ఐపీఎల్ (2020) జోరుగా సాగుతోంది. మార్చిలో కరోనా కారణంగా దేశంలో అన్ని ఆటలు బంద్ అయ్యాయి. ఎప్పుడూ ఏదోఒక టోర్నీతో బిజీగా ఉండే మన క్రికెట్ ఆటగాళ్ళు నెలల తరబడి ఇళ్ళ వద్దే ఉండిపోయారు. టీ20 వరల్డ్ కప్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఐపీఎల్ నిర్వహణ కూడా కష్టంగా మారింది. ఈ సీజన్ ఇక ఉండదేమో అనుకుంటున్న తరుణంలో బీసీసీఐ యూఏఈ వేదికగా జనం లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో చప్పగా సాగిన మ్యాచ్ లు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. భారీ స్కోర్ లతో అలరిస్తుండగా, బౌలర్లు కూడా పదునైన బౌలింగ్ తో రాణిస్తున్నారు. ఐపీఎల్ కు టీవీ వీక్షకులకు నుంచి మంచి స్పందన వస్తోంది. ఐపీఎల్లో ఇప్పుడు సగం మ్యాచ్ లకు దగ్గర అవుతున్నారు. ఒక్కో జట్టు టోటల్ గా 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. అన్ని జట్లు ఏడేసి మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాకా ఇక మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్ కి అవకాశం ఏర్పడింది.

మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్ అంటే తమ జట్లలోని ఆటగాళ్లను ఇతర జట్లకు విక్రయించుకునే అవకాశం కల్పించడం. అంటే ఏ జట్టు అయినా తమకు అవసరం లేదు అనుకున్న వాళ్ళను ఇతర జట్లకు విక్రయించుకోవచ్చు. అలాగే ఇతర జట్లు వదిలేసుకుంటున్న ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు. అయితే అన్ని జట్లకు తాము కోరుకున్న ఆటగాళ్ళను వదిలేయడానికి లేదు. సీజన్లో ఏడు మ్యాచ్ లకు గానూ కేవలం ఒకటి లేదా రెండు మ్యాచ్ లు ఆడిన వాళ్ళను మాత్రమే అలా అమ్మడానికి ఉంటుంది. ఆటగాళ్ళు రెండుకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడి ఉంటే మాత్రం అమ్మకానికి అవకాశం ఉండదు. సరిగ్గా అన్ని జట్లు ఏడు చొప్పున మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాకే మిడ్ సీజన్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చు. ఎనిమిదో మ్యాచ్ ఆడారంటే మాత్రం ఇక ఆటగాళ్ళ విక్రయానికి, కొనుగోలుకు ఇక అవకాశం ఉండదు. మరి ఈ సీజన్లో ఏ జట్లు ఎవరిని వదిలించుకుని.. మరెవరిని కొంటాయో చూడాల్సి ఉంది.