Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ముట్టడికి కట్టగట్టుకొని వచ్చారు.. హైదరాబాద్​ లో తీవ్ర ఉద్రిక్తత!

By:  Tupaki Desk   |   13 Oct 2020 6:30 PM IST
అసెంబ్లీ ముట్టడికి కట్టగట్టుకొని వచ్చారు..  హైదరాబాద్​ లో తీవ్ర ఉద్రిక్తత!
X
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్​లో నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు చాలా తగ్గిపోయాయి. ఏదన్నా విద్యార్థి సంఘమో, రాజకీయపార్టీయో నిరసనకు పిలుపునిచ్చినా పోలీసులు ముందస్తుగా అరెస్ట్​లు చేసేవారు. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. దీంతో కొన్నేళ్లుగా హైదరాబాద్​లో ఆందోళనలే కనిపించడం లేదు. అయితే మంగళవారం మాత్రం అసెంబ్లీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాలు ఒకే సారి అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. నిరసనను అదుపుచేయలేక కొద్దిసేపు పరుగులు పెట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమే నేతలను పీఎస్​లకు తరలించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ కీలక బిల్లును సవరించేందుకు అసెంబ్లీ సమావేశమైంది. సాధారణంగా జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీచేసేందుకు అనర్హులు.

కానీ టీఆర్​ఎస్​కు చెందిన కొందరు బలమైన నేతలకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సవరించేందుకు మంగళవారం అసెంబ్లీని సమావేశపరిచారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో సడెన్ ​గా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. మరో వైపు డబుల్​ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసన కు దిగారు. దీంతో అందరూ ఓకే సారి అసెంబ్లీ వద్ద కు చేరుకోవడం తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లకూడదని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నేతలు ఒక్క సారి గా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.