Begin typing your search above and press return to search.

దారుణ ఓటమి తర్వాత కూడా ఇవేం మాటలు బాబు?

By:  Tupaki Desk   |   7 March 2021 4:33 AM GMT
దారుణ ఓటమి తర్వాత కూడా ఇవేం మాటలు బాబు?
X
ప్రజలు దేనినైనా ఒప్పుకుంటారు కానీ అహంకారాన్ని ఒప్పుకోరు. మంచి.. చెడు పక్కన పెడితే.. తనకు మించిన తోపు మరెవరూ ఉండరన్న మాటను పరిగణలోకి తీసుకోరు సరికదా.. ఈసడించుకుంటారు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారికి తిరుగు ఉండదు. అందుకుభిన్నంగా తమను తాము గొప్పగా భావించే వారు.. ప్రజలకు దూరం అవుతారు. వారికి అధికారం అందనంతగా దూరం పెరిగిపోతుంది. జగన్ విషయాన్నే తీసుకోండి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలు పడే ఇబ్బందుల్ని మాత్రమే ప్రస్తావించే వారే తప్పించి.. చంద్రబాబు కంటే తాను ఎంత మొనగాడన్న విషయాన్ని చెప్పుకునే వారు కాదు. మహా అయితే.. బాబు పాలన ఎలా ఉండేది? తన తండ్రి పాలన ఎలా సాగిందన్న విషయాన్ని గుర్తు చేసి.. తీర్పు చెప్పాలని అభ్యర్థించేవారు.

అన్నింటికి మించి.. అన్నిసార్లు బాబుకు అవకాశం ఇచ్చారు. ఈసారి నాకు ఇవ్వండి.. ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు అంటూ ప్రజల్ని ప్లీజింగ్ చేసిన తీరుకు ఏపీ ప్రజలు.. సర్లే..ఒకసారి ఛాన్సు ఇస్తే ఏమైందన్న ఆలోచనకు వచ్చి.. అదిరిపోయే విజయాన్ని అందించి.. అధికారాన్ని కట్టబెట్టారు. ఇదంతా చూసినప్పుడు.. నాకన్నా తోపు ఎవరున్నారు? అన్న అహంకారపూరిత మాటలు జగన్ నోటి నుంచి వినిపించవు.

కానీ.. దారుణ పరాజయాన్ని పొంది.. వరుస ఎదురుదెబ్బలు తింటున్న వేళలోనూ.. బాబు నోటి నుంచి వస్తున్న బలుపు మాటలు.. ఆయనకు మైనస్ గా మారుతున్న విషయాన్ని గుర్తించటం లేదని చెప్పాలి. తాజాగా సాగుతున్న పుర ఎన్నికల్లో బాబు నోటి నుంచి వస్తున్న మాటల్ని చూసినప్పడు విస్మయానికి గురి కావాల్సిందే. జగన్ ను తిటట్టాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. మన మధ్య లేని దివంగత మహానేతపైన చేసే వ్యాఖ్యలు.. తాను ఎంత గొప్పోడ్నో అర్థమవుతుందా? అన్నట్లుగా చెప్పుకునే మాటలు ప్రజలు హర్షించరన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు అర్థం చేసుకోరన్నది ప్రశ్న.

విశాఖ టూర్ లో ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే తీసుకుంటే.. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు’’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబుకు ప్రతికూలంగా మారుతున్నాయన్న సత్యాన్ని గుర్తించాలి. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల పేరుతో గుద్దులే.. గుద్దులే అంటూ బాబు చేస్తున్న విమర్శలు.. ప్రజలకు అట్టే కనెక్టు కావటం లేదన్న మాట వినిపిస్తోంది.