Begin typing your search above and press return to search.

జగన్ పై దాడి నికృష్టం - నీచమైనచర్య

By:  Tupaki Desk   |   27 Oct 2018 11:27 AM IST
జగన్ పై దాడి నికృష్టం - నీచమైనచర్య
X
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నికృష్ణ.. నీచమైన చర్యలాంటిదని తెలంగాణ ఆపద్ధర్మ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఈటెల ఈ మేరకు జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని.. కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో భౌతిక దాడులకు తావులేదని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఎవరి పాత్ర ఉందో బయటపెట్టాలని.. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో నైతిక విలువలకు పాతరేస్తున్నారని.. విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన దాడి పరాకాష్టలాంటిదని మంత్రి ఈటెల మండిపడ్డారు. ప్రజలకు అతి చేరువలో ఉండే క్రమంలో వైఎస్ జగన్ పై జరిగిన ఈ ఘటన దుర్మార్గమైందని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులన్నాక జనంతో మమేకమవడం తప్పనిసరి అని.. ఏ నాయకుడైనా పక్కన ఎవరున్నారన్నది చూసుకునే పరిస్థితి ఉండని.. ఇలాంటి దాడులు ఊహించలేమని ఈటెల అన్నారు. నిత్యం జనం కోసం యాత్రల పేరుతో తిరుగుతున్న వైఎస్ జగన్ పై ఈ దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఎయిర్ పోర్టుల్లో సీఎంలకు - మంత్రులకు - ముఖ్యమైన నేతలకు సెక్యూరిటీ ఉండడం లేదని.. అక్కడి భద్రత సిబ్బంది పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.