Begin typing your search above and press return to search.

ఎన్నికల ప్రచారంలో మోడీ బొమ్మని వాడని ఈటల.. కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   14 Aug 2021 6:00 PM IST
ఎన్నికల ప్రచారంలో మోడీ బొమ్మని వాడని ఈటల.. కారణం ఇదేనా?
X
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి ఒక రేంజ్లో నడుస్తోంది. ఈ ఎన్నికను గతంలో ఎప్పుడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. గడిచిన కొద్దిరోజులుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రకటిస్తున్న పథకాలు.. అనుసరిస్తున్న విధానాలు.. అభ్యర్థి ఎంపికలో ప్రదర్శించిన చాణుక్యం.. ఇవన్నీ చూస్తే.. ఈటలను ఓడించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదన్నట్లుగా కేసీఆర్ ఆలోచనగా కనిపించక మానదు.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ పార్టీలో ఉండటం.. అన్నింటికి మించి గులాబీ నేతకు సన్నిహితంగా ఉన్న ఈటలకు.. కేసీఆర్ ఎత్తులు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అందులోకి ఎన్నో ఉప ఎన్నికల్లో కలిసి పని చేసిన ఆయనకు కేసీఆర్ ఎత్తులు ఎలా ఉంటాయో ఈటలకు తెలిసిందే. అందుకే.. తనను డ్యామేజ్ చేసే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పాలి. ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని చూస్తే.. బీజేపీ బలాన్ని ఆయన అస్సలు ఉపయోగించుకోవటం లేదు. ఆ మాటకు వస్తే.. ఈ ఎన్నిక ఈటల వర్సస్ కేసీఆర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి.. టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా మాత్రం ఆయన చెప్పటం లేదు.

అంతేకాదు..తన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మీదా.. ఆయనకు కుడిచేయిగా పని చేస్తున్న హరీశ్ మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్న ఈటల.. తాను పోటీ చేస్తున్న బీజేపీకి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించే మోడీ ఫోటోను కానీ.. అమిత్ షా ఫోటోను కానీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రధాని మోడీ ఇమేజ్ భారీగా దెబ్బ తిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు పెట్రోల్.. డీజిల్ ధరల్ని వందకు దాటించేసిన మోడీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మిగిలిన వాటి ధరల సంగతి ఎలా ఉన్నా పెద్దగా పట్టదేమో కానీ.. నిత్యవసర వస్తువుగా మారిన పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవటం.. దీని భారం ప్రతి ఒక్కరి బడ్జెట్ మీద పడటంతో రగిలిపోతున్నారు.

తాను కానీ మోడీ బొమ్మను పెట్టుకొని తిరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల ఎజెండాను మార్చేసే వీలుందన్న విషయాన్ని గుర్తించిన ఈటల.. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఆయన ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వట్లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈటల రాజేందర్ మోడీ ఫోటోను తన ప్రచారంలో ఎక్కడా కనిపించకకుండా చేస్తున్నారన్న వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ.. బీజేపీ నేతలు.. కార్యకర్తలకు మంట పుట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా మోడీ ప్రస్తావన తీసుకురావటం ద్వారా ఎన్నికలపై ప్రభావాన్ని చూపించి.. ఈటలకు చుక్కలు చూపించాలన్న గులాబీ నేతల వ్యూహం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో రాబోయే రోజులు డిసైడ్ చేయనున్నాయి.