Begin typing your search above and press return to search.

ఎస్సార్ అంత పని చేసిందా..?

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:57 PM
ఎస్సార్ అంత పని చేసిందా..?
X
జాతీయ రాజకీయాల్లో ఇప్పుడో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 2001 నుంచి 2006 మద్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్ కార్యాలయంతో సహా ఇప్పుడు మంత్రులుగా వ్యవహరిస్తున్న పులువురు రాజకీయ నేతలు.. వ్యాపార వర్గాలు.. వీవీఐపీలకు చెందిన ఫోన్లను ఎస్సార్ గ్రూప్ ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఒక ఇంగ్లిషు మీడియా సంస్థ ప్రత్యేకంగా ప్రచురించింది. యూపీఏ సర్కారులో అనేక వ్యాపార లాభాలు పొందినట్లుగా విమర్శలు ఎదుర్కంటున్న ఎస్సార్ గ్రూప్ విషయంలో కేంద్రం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సమయంలోనే.. ఈ తరహా ఆరోపణ రావటం గమనార్హం.

నాటి మంత్రులుగా వ్యవహరించిన ప్రపుల్ పటేల్.. రామ్ నాయక్.. సురేశ్ ప్రభు.. పీయూష్ గోయిల్ లాంటి రాజకీయ నేతలు మాత్రమే కాదు.. వ్యాపార దిగ్గజాలైన ముఖేశ్ అంబానీ.. అనిల్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎస్సార్ గ్రూప్ కు అప్పట్లో (ట్యాపింగ్ జరిగినట్లుగా ఆరోపణలున్న సమయంలో) సెక్యూరిటీ విభాగానికి హెడ్ గా ఉన్న అల్బాసిత్ ఖాన్ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ ప్రధానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎస్సార్ గ్రూప్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో బిగ్ బి అమితాబ్ .. రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్.. ఐడీబీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ పీపీ ఓరా.. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ కేవీ కామత్ లాంటి ప్రముఖులెందరి ఫోన్లో ట్యాప్ అయినట్లుగా ఆరోపించారు. ఇంతకీ ఎస్సార్ గ్రూప్ ఇలాంటి పని చేయటానికి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలు కానీ బయటకు వస్తే.. మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే వీలుందని చెప్పొచ్చు.