Begin typing your search above and press return to search.

మామ టీఆర్ ఎస్.. అల్లుడు కాంగ్రెస్

By:  Tupaki Desk   |   16 March 2019 3:43 PM IST
మామ టీఆర్ ఎస్.. అల్లుడు కాంగ్రెస్
X
తెలంగాణ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మామ తెలంగాణ రాష్ట్రసమితి నుంచి ఎన్నికై మంత్రి కాగా.. ఇప్పుడు ఆయన అల్లుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన 8మంది అభ్యర్థుల జాబితాలో ఈ విచిత్రం చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17లోక్ సభ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్ ఎంపీ స్థానానికి మదన్ మోహన్ రావును అభ్యర్థిగా ప్రకటించింది. మదన్ మోహన్ రావు స్వయానా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అల్లుడు కావడం విశేషం.

మదన్ మోహన్ రావు గతంలో ఇదే జహీరాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ ఎస్ లో మామ ఎర్రబెల్లితోపాటు చేరారు. అయితే అనంతరం వివిధ కారణాల వల్ల మదన్ మోహన్ రావు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్ మోహన్ రావు ఐటీసెల్ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. తాజాగా వెలువడిన కాంగ్రెస్ జాబితాలో ఆయన జహీరాబాద్ ఎంపీ సీటును దక్కించుకున్నారు.

ఇలా మామ టీఆర్ఎస్ లో మంత్రిగా ఉండడం... అల్లుడు ఆ పార్టీకి వ్యతిరేకమైన కాంగ్రెస్ లో ఎంపీగా పోటీచేస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో విశేషంగా మారింది.