Begin typing your search above and press return to search.

డౌటే లేదు... పీఓకే ఇండియాదే..

By:  Tupaki Desk   |   17 Feb 2016 11:01 AM GMT
డౌటే లేదు... పీఓకే ఇండియాదే..
X
పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే) భారతదేశానికేదేనని బ్రిటన్ తేల్చేసింది. పీఓకేతో సహా మొత్తం జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రం భారతదేశానికే చెందుతుందని ఇంగ్లాండుకు చెందిన పార్లమెంటు సభ్యడు ఒకరు చెప్పారు. జమ్ము కాశ్మీర్‌ పూర్తిగా భారత్‌ లో అంతర్భాగమేనని, అది తిరిగి భారత్‌ ఆధిపత్యంలోకి రావాలని ఇంగ్లాండు ఎంపి - అధికార కన్సర్వేటివ్‌ పార్టీ నేత రాబర్ట్‌ జాన్‌ బ్లాక్‌ మన్‌ చెప్పారు.

తాజాగా ఆయన దీనిపై మాట్లాడుతూ... పూర్వ జమ్ము కాశ్మీర్‌ రాజు భారతదేశంతో 'ఇన్‌ స్ట్రుమెంట్‌ ఆఫ్‌ యాక్సెసన్‌'పై సంతకాలు చేశారని, జమ్ము కాశ్మీర్‌ పై పూర్తి నియంత్రణాధికారం భారత్‌ కు దఖలు చేశారని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌ అక్రమంగా జమ్ము కాశ్మీర్‌ భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన అన్నారు. పాక్‌ తాను ఆక్రమించిన ప్రాంతాన్ని భారత్‌ కు తిరిగి ఇచ్చేయాలని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ - భారత్‌ ల వద్ద అణ్వాయుధాలున్నాయని.. కాబట్టి కాశ్మీర్‌ కోసం యుద్దం చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన చెప్పారు. అయితే పాకిస్తాన్‌ తాను ఆక్రమించిన ప్రాంతాన్ని భారత్‌ కు తిరిగి అప్పగించాలని ఆయన అన్నారు.

ఒకప్పుడు భారత్ ను పాలించిన బ్రిటన్ ఈ విషయంలో ఎన్నడూ బయటపడిన దాఖలాలు లేవు. ఇలా స్పష్టంగా మాట్లాడి పీఓకే ఇండియాదేనని కచ్చితంగా చెప్పడం ఇంతకుముందెన్నడూ లేదు. దీంతో పాక్ వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలని భారత హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.