Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు ద్రౌప‌ది ముర్ము స్వ‌గ్రామంలో విద్యుత్ వెలుగులు

By:  Tupaki Desk   |   27 Jun 2022 6:31 AM GMT
ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు ద్రౌప‌ది ముర్ము స్వ‌గ్రామంలో విద్యుత్ వెలుగులు
X
రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా అని సామెత‌. ఇప్పుడు దీన్ని రాజు త‌లుచుకుంటే డ‌బ్బుల‌కు కొద‌వా అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు క‌రెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియ‌ని ఆ గ్రామ‌స్తుల ఇళ్ల‌కు ఒక్కసారిగా విద్యుత్ వెలుగులు రావ‌డంతో వారి ఆనందానికి అంతు లేదు. వివ‌రాల్లోకెళ్తే కేంద్రంలో అధికార ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ద్రౌప‌ది ముర్ము పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆమె నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు.

ద్రౌప‌ది ముర్ము ఒడిశాకు చెందిన సంతాల్ తెగ గిరిజ‌న మ‌హిళ‌. ఒడిశాలోని మ‌యూర్ భంజ్ జిల్లా కుసుం స‌మితిలోని ఉప‌రొబెడ ఆమె స్వ‌గ్రామం. ఆధునికంగా దేశం ప‌రుగెడుతున్నా ఇప్ప‌టికీ ఆమె గ్రామంలో క‌రెంటు స‌దుపాయం లేదు. ఇప్ప‌టీక ప్ర‌జ‌లు దీప‌పు బుడ్లు, లాంత‌ర్లు పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ద్రౌప‌ది ముర్ము స్వ‌గ్రామానికి వెళ్లిన మీడియా ప్ర‌తినిధులు ఆ మారుమూల గ్రామంలోని డుంగ్రు సాహి ప్రాంతానికి విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో పలు కథనాలు రాశారు. దీంతో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ఏర్పాటు చేయాల‌ని ఒడిశాలోని న‌వీన్ ప‌ట్నాయక్ ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింది.

కాగా కొన్ని దశాబ్దాల క్రితమే ద్రౌపది ముర్ము ఉపరొబెడ గ్రామాన్ని వదిలి రాయ్‌రంగపూర్‌ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ద్రౌప‌ది ముర్ము మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి డుంగ్రు సాహి గ్రామంలో నివసిస్తున్నాడు. 3,500 మంది జనాభా ఉన్నా ఇన్నేళ్లూ తమ గ్రామాన్ని పట్టించుకోని అధికారులు ఇప్పుడు ద్రౌపది పుణ్యమా అని విద్యుత్తు సరఫరా కల్పిస్తున్నారని ఆ గ్రామ‌స్తులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఒడిశా ప్ర‌భుత్వం ఆదేశాల‌తో క‌దిలిన టాటా పవర్ నార్త్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అధికారులు, కార్మికులు ముప్పై ఎనిమిది విద్యుత్ స్తంభాలు, 900 మీటర్ల కేబుల్‌లు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లతో ద్రౌపది ముర్ము స్వగ్రామం ఉప‌రొబెడ‌లో విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఉప‌రొబెడ గ్రామానికి ఇప్ప‌టివ‌ర‌కు విద్యుత్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో గ్రామ‌స్తులు త‌మ మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ కోసం చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలకు వెళ్తున్నారు.

డుంగ్రు సాహికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప‌లుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఇప్పుడు, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుదీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టింద‌ని వివ‌రిస్తున్నారు. ద్రౌపది ముర్ము వల్లే త‌మ‌కు కరెంట్ వస్తుందని అంటున్నారు.