Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారు ‘‘కోడ్’’ చిక్కుల్లో పడిందా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 4:38 AM GMT
తెలంగాణ సర్కారు ‘‘కోడ్’’ చిక్కుల్లో  పడిందా?
X
ఇవాల్టి రోజున దూకుడుతనం అవసరం. రాజకీయాల్లో అత్యవసరం. అయితే.. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ కు దూకుడుతనం చాలా ఎక్కువ. ఉద్యమ నేపథ్యం ఇందుకు మరింత సాయం చేసిందని చెప్పాలి. నిజానికి ఈ దూకుడుతనంతోనే ఉద్యమాన్న పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీని డైలమాలో పడేసి.. తాము అనుకున్నది సాధించటంలో గులాబీ దళం విజయం సాధించొచ్చని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు.. ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడితో పాటు.. తెలంగాణ దిశగా నిర్ణయం తీసుకుంటే అంతులేని రాజకీయ ప్రయోజనం కలుగుతుందన్న దురాశ కాంగ్రెస్ కు సానుకూల నిర్ణయాన్ని తీసుకునేలా చేశాయన్నది నిష్టుర సత్యం.

అయితే.. తమ అమ్ముల పొదిలో బలమైన అస్త్రంగా ఉండే దూకుడుతనం ఎల్లకాలం ఆయుధంగా ఉండదని.. కొన్నిసార్లు లేనిపోని ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుందన్న సత్యం తాజాగా గులాబీ దళానికి అర్థమై ఉండాలి. ఇప్పటివరకూ టీఆర్ ఎస్ ఎదుర్కొన్న ఉప ఎన్నికలు మొత్తం సెంటిమెంట్ చుట్టూనే సాగేవి. సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఉప ఎన్నికల్లో విపక్షంగా పోరాడిన టీఆర్ ఎస్ పార్టీకి ఒకమాట.. ఎక్కువ.. తక్కువ మాట్లాడినా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఒకవేళ ఆ పార్టీ మీద ఎవరైనా ఆరోపణలు.. విమర్శలు చేస్తే.. ‘‘తెలంగాణ ద్రోహి’’ అన్న ట్యాగ్ తగిలించే వారు. దీంతో.. ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి టీఆర్ ఎస్ కు బ్రేకులు వేయటం చాలా కష్టమయ్యేది.

విపక్షంగా ఉండే వెసులుబాటు.. అధికారపక్షంగా కుదరన్న సత్యం టీఆర్ ఎస్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. తాజాగా వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలే ఇప్పుడు శాపంగా మారనున్నాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆ పార్టీ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండలో చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మిగిలిన అన్నింటిని వదిలేస్తే.. క్రిసమస్ పర్వదినాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న మాటను చెప్పారు. నిజానికి ఇది కొత్త హామీగానే చెప్పాలి. ఇలాంటివి చాలానే చెప్పుకొచ్చారు.

తెలంగాణ అధికారపక్షం ఎప్పుడు తప్పులు చేస్తుందా? అని ఎదురుచూస్తున్న విపక్షం ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారి చేసిన కంప్లైంట్ లో ‘విషయం’ ఉండటం.. వెంటనే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపటం.. వారు స్పందించి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరటం జరిగిపోయాయి. అయితే.. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. హామీలకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన జీవోలు జారీ చేయలేదని పేర్కొంది. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు ఎక్కడా కొత్త నిర్ణయాలు ప్రకటించలేదని పేర్కొంది. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదని.. దూకుడుగా అధికారపక్షం తప్పులు చేసి దొరికిపోయిందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్ష నేతలు ఉత్సాహంగా కోడ్ ఉల్లంఘన మీద మాట్లాడుతుంటే.. అధికారపక్ష నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోడ్’ చిక్కులు తెలంగాణ అధికారపక్షానికి చుట్టుకున్నాయా? అన్నది ప్రశ్నగా మారింది.