Begin typing your search above and press return to search.

మోడీ డబ్బులిస్తే వద్దనేశారు !

By:  Tupaki Desk   |   28 Oct 2015 11:28 AM IST
మోడీ డబ్బులిస్తే వద్దనేశారు !
X
పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి భారత్ నుంచి పాక్ చేరి.. తాజాగా స్వదేశానికి చేరుకున్న మూగ.. బధిర గీత గురించి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం భజరంగీ భాయిజాన్ రగిలించిన స్ఫూర్తితో గీత ఉదంతంపై కోట్లాది మంది భారతీయుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో భారత సర్కారు సైతం సానుకూలంగా స్పందించి.. గీతను పాకిస్థాన్ నుంచి భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరపటం.. సోమవారం ఆమె పాక్ నుంచి భారత్ కు రావటం తెలిసిందే.

స్వదేశానికి చేరుకున్న గీతను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కలిసి.. ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్లారు. గీతతో మాట్లాడిన ప్రధాని మోడీ.. పాక్ లో ఉన్న సమయంలో గీతకు ఆశ్రయం ఇచ్చిన పాక్ స్వచ్ఛంద సంస్థ ‘‘ఈదీ’’కి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు.

ఆశ్చర్యకరంగా భారత ప్రధాని మోడీ ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని ఈదీ ఫౌండేషన్ తిరస్కరించింది. ప్రధాని మోడీ ప్రకటన మీద స్పందించిన ఈదీ సంస్థ నిర్వాహకులు అబ్దుల్ సత్తార్ మోడీ విరాళాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని సదరు స్వచ్ఛంద సంస్థ తమ ప్రతినిధి చేత ఈ ప్రకటన చేశారు. ఇతర దేశాలకు చెందిన సంస్థలు కానీ.. ప్రభుత్వాల నుంచి కానీ విరాళాలు తీసుకోవటం తమ సంస్థకు లేవని స్పష్టం చేసిన ఈదీ ఫౌండేషన్ భారత ఫ్రధాని ప్రకటించిన విరాళాన్ని స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ ప్రకటన విడుదల చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఈదీ సంస్థ తీసుకున్న నిర్ణయంపై భారత్ ప్రభుత్వం.. రాజకీయ పక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ప్రశ్నగా మారింది.