Begin typing your search above and press return to search.

మిమ్మల్ని ఏపీలో దించే భాద్యత మాది ... నయా దందా .. పోలీసులు ఏంచెప్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   7 July 2020 8:10 AM GMT
మిమ్మల్ని ఏపీలో దించే భాద్యత మాది ... నయా దందా .. పోలీసులు ఏంచెప్తున్నారంటే ?
X
హైదరాబాద్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైయ్యే కేసులో సుమారు 70 శాతం కేసులు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు అవుతున్నాయి. దీనితో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కరోనా పెరుగుతున్న నేపద్యంలో మళ్లీ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారు అన్న వార్తలు కూడా వినిపించడంతో హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారు సొంతూర్లకి పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీ కి చెందినవారు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.

అయితే , ఏపీకి వెళ్లాలంటే పాస్ తప్పనిసరి. ఈ పాస్ లేకుండా ఏపీకి వెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న వాళ్లకు పోలీస్ శాఖ సూచనలు చేస్తోంది. పాస్ లేకుండా పంపిస్తాము అంటే నమ్మి డబ్బులిస్తే మోసపోతారు అని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెబుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ చెక్ పోస్టుల వద్ద ఈపాస్ లేకుండా పంపించటం వీలు కాదని పోలీస్ శాఖ మరోసారి స్పష్టం చేస్తోంది. ఈపాస్ తీసుకున్న వారిని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారి నుండి కరోనా పరీక్షలకోసం నమూనాలు సేకరించి,వారి అన్ని వివరాలను నమోదు చేసుకుని క్వారంటైన్ కి పంపి కానీ, లేదా హోం క్వారంటైన్ కు అనుమతించి కానీ పంపిస్తున్నారు. చేతి పై వారికి క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాసు తీసుకుని ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న చాలామంది ఏపీలో కి వెళ్లడానికి దొంగ దారులను అన్వేషిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది దళారులు బోర్డర్ దాటిస్తామని,ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీలోకి వెళ్లేలా చేస్తామని హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే వారి వద్ద డబ్బులు దండుకునే పని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బయట దళారులను నమ్మి మోసపోవద్దని,స్పందన యాప్ ద్వారా అప్లై చేసుకుంటే అనుమతి వచ్చిన వారు మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని పదే పదే స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే ఏపీలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్తున్నారు.పాస్ ఉన్నప్పటికీ ఏపీకి వెళ్లాలంటే కచ్చితంగా ఈ సమయం లోపల వెళ్లాలని వారంటున్నారు.

ఏపీలో కేసులు పెరుగుతుంటే,ఏపీకి హైదరాబాద్ నుండి వెళ్లే వాళ్ల రద్దీ కూడా అంతే పెరుగుతుంది. హైదరాబాద్లో రోజు రోజుకి కేసులు పెరుగుతుండడం, కరోనా ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసేలా ఈ సంవత్సరం పలు సంస్థలు తమ ఉద్యోగులకు అవకాశం ఇవ్వడం వంటి అనేక కారణాలు హైదరాబాద్ లోని సెటిలర్స్ ను తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా చేస్తున్నాయి. ఏపీకి పెరుగుతున్న రద్దీ నేపద్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి తీసుకొని మాత్రమే ఏపీలోకి రావాలని ఖచ్చితంగా తేల్చి చెబుతోంది.