Begin typing your search above and press return to search.

అశ్లీల వీడియోలు చూస్తున్నారా..? సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చిక్కిన‌ట్టే..

By:  Tupaki Desk   |   21 April 2020 4:00 AM IST
అశ్లీల వీడియోలు చూస్తున్నారా..? సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చిక్కిన‌ట్టే..
X
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా సోష‌ల్ మీడియాకు అంకిత‌మ‌య్యారు. ఫోన్ వ‌ద‌ల‌కుండా ఉంటున్నారు. ఈక్ర‌మంలో చాలామంది ఇంట్లో ర‌హాస్యంగా అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాటుమాటుగా చూస్తున్న వారు ఆయా వెబ్‌సైట్‌ల‌లో సైన్ ఇన్ అయితే మాత్రం సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చిక్కిన‌ట్టే. సైబ‌ర్ నేర‌గాళ్లు ఇదే అదునుగా చేసుకుని భారీగా దండుకుంటున్నారు. దీన్నే ఈ–మెయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్ అని అంటారు. హైద‌రాబాద్‌లో ఈ సైబ‌ర్ నేరం పెరుగుతోంది. ఆ నేర‌గాళ్ల‌కు లాక్‌డౌన్ వ‌రంగా మారింది. అందుకే 18 రోజుల్లోనే ఎంతోమంది సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చిక్కారు. అయితే వారిలో కేవ‌లం 8 మంది బాధితులు మాత్ర‌మే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో సైబ‌ర్ నేర‌గాళ్ల విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అశ్లీల వెబ్‌సైట్లు సందర్శించిన వారిని సైబర్ నేర‌గాళ్లు మోసం చేస్తున్నారు. అయితే ఇందులో ఆ నేరాల‌ను చూడ‌ని వారిని కూడా మోసం చేస్తున్నారు. వీక్షించిన వారు ఆ నేరగాళ్లు కోరిన మొత్తం ఇస్తూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ చూడ‌ని వారిని కూడా ఆ నేర‌గాళ్లు డిమాండ్ చేస్తుండ‌డంతో వారే ముందుకు వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అశ్లీల వెబ్‌సైట్లు చూడ‌డం పెరిగిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్‌ వెబ్‌సైట్‌గా ఉన్న పోర్న్ హబ్‌కు వీక్ష‌కుల తాకిడి అధికంగా ఉంది. ఈ లాక్‌డౌన్ నేప‌థ్యంలో సైట్ వీక్ష‌ణ‌లు 35 శాతం పెరిగాయ‌ని గణాంకాలు చెబుతున్నాయి.

ప్ర‌ధానంగా భార‌త‌దేశంలో పోర్న్ వెబ్‌సైట్‌ల వీక్ష‌ణ పెరిగిపోవ‌డాన్ని గుర్తించిన సైబ‌ర్ నేర‌గాళ్లు సొమ్ము చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో నైజీరియా సహా మరికొన్ని ద‌క్షిణ‌ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు త‌మ ప‌ని మొద‌లుపెట్టారు. ఆ నేర‌గాళ్లు కొన్ని అశ్లీల వెబ్‌సైట్స్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించిన వారి వివ‌రాల‌ను బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సైట్స్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షించే వారి వివ‌రాల‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ప్రోగ్రామింగ్‌ దానంతట అదే యాక్టివేట్‌ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్‌లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్‌ అయి ఆ వ్యక్తి ఫొటోను కూడా సంగ్రహిస్తోంది. దీంతో పాటు అతడి మెయిల్‌ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది. ఆ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్‌ నేరగాళ్లు సేక‌రిస్తున్నారు.

ఇక ఆ వివరాలతో నేర‌గాళ్లు పోర్న్‌ సైట్‌ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్‌ ఐడీకి బెదిరింపు మెయిల్‌ పంపిస్తున్నారు. అతడి ఫొటో, వీక్షించిన సైట్‌ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు. నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామని, మీ మెయిల్‌ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామని త‌దిత‌ర విష‌యాల‌తో వారికి బెదిరింపులు చేస్తున్నారు. అలా చేయ‌కుండా ఉండాలంటే తాము అడిగిన మొత్తం బిట్‌ కాయిన్స్‌ రూపంలో చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ప‌లువురి వారి బెదిరింపుల‌కు లొంగిపోయి చెల్లిస్తున్నారు.

అయితే పోర్న్ వెబ్‌సైట్లు చూడ‌ని వారికి కూడా సైబ‌ర్ నేర‌గాళ్లు ఈ–మెయిల్‌ బెదిరింపులు చేస్తున్నారు. అలా బెదిరింపులు వ‌చ్చిన 8 మందీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అనేక డొమైన్లకు చెందిన ఈ–మెయిల్‌ ఐడీలను, పాస్‌వర్డ్స్‌ ను అనునిత్యం కొందరు సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తూ ఉంటారు. ఆ వివరాలను డార్క్‌ నెట్‌ ద్వారా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. నేరగాళ్లు పంపుతున్న మెయిల్స్‌లో తమ పాస్‌వర్డ్స్‌ సైతం కూడా ఉంటుండడంతో బాధితులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్‌ పంపిస్తున్నదీ నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే అని అనుమానిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. దీనిపై కేసులు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. అయితే ప్ర‌జ‌లంద‌రూ త‌మ‌త‌మ పాస్‌వ‌ర్డ్స్ ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. ఎవ‌రైనా బెదిరింపు మెయిల్స్ చేస్తే త‌మ‌కు వెంట‌నేఏ ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు చెబుతున్నారు.