Begin typing your search above and press return to search.

అది సరే, మరి కాంగ్రెస్ కు ఎందుకు వేయలేదు ?

By:  Tupaki Desk   |   11 Nov 2020 11:45 PM IST
అది సరే, మరి కాంగ్రెస్ కు ఎందుకు వేయలేదు ?
X
ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతల్లో ఎవరైనా సమాధానం చెప్పగలరా ? దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవాలన్న కసితోనే బీజేపీకి జనాలు ఓట్లేశారంటు తెలంగాణా కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే టీఆర్ఎస్ లో చేరిపోతాడని బీజేపీ ప్రచారం చేసిందట. అందుకనే బీజేపీ గెలిచిందంటు పొన్నం చెప్పారు. పొన్నం చెప్పిన మాటలు వింటే ఆడలేక మద్దెలు ఓడన్నాడట వెనకటికెవడో.

ఉపఎన్నికల్లో రఘునందనరావు సానుభూతితో గెలిచాడే కానీ గెలిచింది బీజేపీ కాదట. అంటే పొన్నం ఉద్దేశ్యంలో గడచిన రెండు ఎలక్షన్లో పోటీ చేసిన రఘునందనరావు ఓడిపోయారు. కాబట్టే సానుభూతితో ఇపుడు ఓట్లేసి గెలిపించారని చెప్పారు. నిజంగా గెలవలేని పార్టీ నేతలు ఇలాగే చెబుతారని జనాలు అనుకుంటున్నారు. ఇక్కడ పొన్నం మరచిపోయిన విషయం ఒకటుంది.

ఉపఎన్నికకు నగారా మోగగానే బీజేపీ అభ్యర్ధిగా రఘునందనరావు ప్రచారంలోకి దిగేశారు. మరి కాంగ్రెస్ తన అభ్యర్ధిని ఎప్పుడు ఫైనల్ చేసింది. చివరి నిముషంలో మాత్రమే అభ్యర్దిని ఫైనల్ చేసిన కాంగ్రెస్ చివరకు టీఆర్ఎస్ నుండి వచ్చిన చెరకు శ్రీనివాసుల రెడ్డిని ఎంపిక చేసింది. ఏం కాంగ్రెస్ పార్టీలో దుబ్బాకలో పోటీ చేసేంత శక్తున్న నేతలే లేరా ?

పోనీ బీజేపీ నేతలంతా దుబ్బాకలో దాదాపు నెల రోజులు మోహరించారు. అలా కాంగ్రెస్ నేతలు దుబ్బాకలో క్యాంపు వేసి ప్రచారం చేశారా ? అసలు కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు ఎంతమంది సీనియర్ నేతలొచ్చి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే బీజేపీకి ప్రజలు ఓట్లేశారని చెప్పిన పొన్నం మరి అదే జనాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయలేదో చెప్పగలరా ? పైగా తెలంగాణాను ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న నేతలు ఆ విషయాన్ని జనాలు ఎందుకు గుర్తించటం లేదో సమీక్షించుకున్నారా ? ముందు ఇతర పార్టీల గురించి మాట్లాడటం మానేసి ఓటమిపై స్వీయ పరిశీలన చేసుకోవటం మంచిది.