Begin typing your search above and press return to search.

ఆ డ్ర‌గ్స్ తీసుకుంటే మ‌త్తులో చిత్త‌వుతారు!

By:  Tupaki Desk   |   3 July 2017 8:51 AM GMT
ఆ డ్ర‌గ్స్ తీసుకుంటే మ‌త్తులో చిత్త‌వుతారు!
X
హైద‌రాబాద్ లో మ‌రో భారీ డ్ర‌గ్స్ రాకెట్ గుట్టు ర‌ట్ట‌యింది. నిన్న ముగ్గురు సభ్యులతో కూడిన డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు వ్య‌క్తులు డ్ర‌గ్స్ రాకెట్‌ కు సంబంధించిన అనేక వివ‌రాలు తెలిపార‌ని ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు.

ఈ డ్ర‌గ్స్ రాకెట్ లో ఎల్ ఎస్ డీ లేదా ఏసెర్ మ‌రియు ఎండీ ఎమ్ ఏ (జెన్ - బ్లూ డ్రాగ‌న్ - మోలీ ) వంటి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన డ్ర‌గ్స్ ల‌భించాయి. ఈ రెండు డ్ర‌గ్స్‌ అంత పెద్ద మొత్తంలో హైద‌రాబాద్ లో ల‌భించ‌డం ఇదే మొద‌టిసారి. 700 కంటే ఎక్కువ యూనిట్స్‌లో ఈ డ్ర‌గ్స్ ల‌భించ‌డం అధికారుల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. ఈ డ్ర‌గ్స్‌ను చికాగో నుంచి తెచ్చి హైద‌రాబాద్ లో విక్ర‌యిస్తున్నార‌ని అధికారుల‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

ఈ రెండు డ్ర‌గ్స్ పేప‌ర్ల (స్ట్రిప్స్‌)రూపంలో ల‌భించ‌డం వల్ల చాలా సులువుగా డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్లు ర‌వాణా చేస్తున్నారు. చికాగో నుంచి కొరియ‌ర్ లో ఈ డ్ర‌గ్స్ హైద‌రాబాద్ కు చేరుతున్నాయి. కొంత డ్ర‌గ్‌ను ఈ స్ట్రిప్స్ పై డాట్స్ రూపంలో చల్లుతారు. ఆ స్ట్రిప్స్‌ను నాలుకుపై ఉంచుకోగానే శ‌రీరంపై మ‌త్తు ప్ర‌భావం ప్రారంభ‌మ‌వుతుంది.

ఎల్ ఎస్ డీ డ్ర‌గ్‌ ను మైక్రో గ్రామ్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు. ఒక మైక్రోగ్రాం ఎల్ ఎస్ డీ డాట్ స్ట్రిప్‌ను రూ.3000, ఒక గ్రాము ఎండీఎమ్ ఏను రూ.4000 చొప్పున విక్ర‌యిస్తున్నారు. ఒక ఎల్ ఎస్ డీ చుక్క‌ను నాలుక‌పై పెట్టుకుంటే దాని మ‌త్తు ప్ర‌భావం 12 గంట‌ల‌పాటు ఉంటుంద‌ని స‌బ‌ర్వాల్ తెలిపారు. అయితే, దీని ప్ర‌భావం వ‌ల్ల కొంత‌మందికి ఆనందం, మ‌రి కొంత మందికి ఆందోళ‌న క‌లుగుతాయ‌ని అకున్ స‌బ‌ర్వాల్‌ చెప్పారు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ ముఠాల ఆట క‌ట్టిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/