Begin typing your search above and press return to search.

ఉడ్తా హైదరాబాద్​.. జిమ్స్​ కేంద్రంగా స్టెరాయిడ్స్​ దందా!

By:  Tupaki Desk   |   22 Sept 2020 12:00 PM IST
ఉడ్తా హైదరాబాద్​.. జిమ్స్​ కేంద్రంగా స్టెరాయిడ్స్​ దందా!
X
హైదరాబాద్​ లో జిమ్స్​, ఫిట్​నెస్​ సెంటర్లు కేంద్రంగా ఓ నయా డ్రగ్స్​ దందా షురువైంది. జిమ్స్​, ఫిట్​నెస్​ కేంద్రాలకు వచ్చే యువతే లక్ష్యంగా కేటుగాళ్లు వాళ్లకు స్టెరాయిడ్ లు అంటగడుతున్నారు. సిక్స్​ ప్యాక్​ లు, కండలు తిరిగే దేహం కోసం సంవత్సరాల తరబడి కసరత్తుల చేయాల్సిన అవసరం లేదని.. తాము ఇచ్చే సప్లిమెంట్స్​ తీసుకుంటే కొన్ని వారాల్లోనే ఆకర్షణీయమైన దేహాన్ని సొంతం చేసుకోవచ్చని వారికి ఆశలు కల్పిస్తున్నారు. ఇలా యువతకు స్టెరాయిడ్​లను విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్​ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

జిమ్స్​ కు వెళ్లే యువతే టార్గెట్​..

ఆకర్షణీయంగా కనిపించాలని, కండలు తిరిగే దేహం సొంతం చేసుకోవాలని, సిక్స్​ప్యాక్​లతో అదరగొట్టాలని యువత కలలు కంటుంటారు. అందులో భాగంగా వారు గంటల తరబడి కసరత్తులు చేస్తారు. అయితే అటువంటి యువతను ఈ ముఠా టార్గెట్​ చేస్తుంది. గంటల తరబడి జిమ్స్​లో గడపాల్సిన అవసరం లేదని.. కేవలం కొన్ని రోజుల్లోనే మీరు అదిరిపోయే బాడీని సొంతం చేసుకోవచ్చని వారికి ఈ స్టెరాయిడ్స్​ను అంటగడుతున్నారు. సాధారణంగా అనస్తీషియా డాక్టర్లు.. రక్తపోటును పెంచి గుండె సక్రమంగా పనిచేయడానికి పేషెంట్లకు మెఫెంటెర్మైన్​ సల్ఫేట్​ ఇంజెక్షన్​ ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్​ ప్రభావంతో నరాలు తెరుచుకుంటాయి. బాడీ ఉత్తేజితం అవుతుంది. ప్రస్తుతం ఓ ముఠా యువతకు ఇటువంటి ఇంజెక్షన్​లనే అంటగడుతుంది. ఈ మందు వాడితే 5 కిలోల బరువులు కూడా లేపలేని వారు ఓకేసారి 30 కిలోల లేపుతారు. వేగంగా కసరత్తులు చేస్తారు.

ఈ ఇంజెక్షన్​ ఒక సారి తీసుకుంటే దీని ప్రభావం దాదాపు 5 నెలల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఒక్కొ ఇంజెక్షన్​కు ఈ ముఠా రూ.5 వేల నుంచి 30వేలు వసూలు చేస్తున్నది. ఈ ఇంజెక్షన్​ తో తక్కువ సమయంలో యువత కోరుకున్న బాడీషేప్​ వస్తుండటం తో ఈ ఇంజెక్షన్​ కు యువత బానిసలవుతున్నారు. కాగా యువత ఈ స్టెరాయిడ్స్​కు బానిసైతే దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తరుచూ ఈ ఉత్ప్రేరకాలు తీసుకుంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు లైంగిక సామర్థ్యం తగ్గి పోవడం వంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

దందా ఎలా బయటపడిందంటే..

చాంద్రాయణగుట్ట అల్​జూబిలీ కాలనీ చెందిన మహ్మద్​ షా పహర్​ గతంలో మెడికల్ రిప్రెంజెంటివ్​గా పని చేశారు. అతడికి పలు మెడికల్​ ఏజెన్సీలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో షా పహర్​చాదర్ ​ఘాట్​ కు చెంది షేక్​ అబ్దుల్​ ఒవైసీ తో చేతులు కలిపి హైదరాబాద్​ లో ఈ దందాకు తెరలేపాడు. వీళ్లు ఢిల్లీకి చెందిన అక్షయ్​ ఎంటర్​ ప్రైజెస్​ మెడికల్​ ఏజెన్సీకి చెందిన విక్రమ్​ అనే వ్యక్తితో చేతులు కలిపి ఈ ఇంజక్షన్లను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ యువతకు అంటగడుతున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను అరెస్ట్​ చేశారు.