Begin typing your search above and press return to search.

భావి ప్రధానులు... బంగారు భారతం కలలు

By:  Tupaki Desk   |   19 Sep 2022 6:35 AM GMT
భావి ప్రధానులు... బంగారు భారతం కలలు
X
భారతదేశాన్ని బంగారు దేశం చేస్తామని అంటున్నారు. ఇంతకంటే ఏమి కావాలి. ఈ దేశంలో సాటిలేని సంపద ఉంది. మానవ వనరు ఉంది. అతి పెద్ద సంపదగా యువత ఉంది. నీటి సదుపాయాలు ఉన్నాయి. సమశీతోష్ణమైన వాతావరణం ఉంది. గనులున్నాయి. మణులున్నాయి. మరి ఇన్ని ఉన్న ఈ దేశంలో లేనిదేంటి అంటే ఆసేతుహిమాచలం మొత్తం జనాలను కలపి నడిపించి వారి ప్రతిభను ఏ వివక్ష లేకుండా వాడుకోవడం.

అన్నిటికీ మించి చిత్తశుద్ధిలో నిజాయతీతో పనిచేయడం. రాజకీయం కోసం ఓట్ల కోసం కాకుండా రేపటి భారతం కోసం పనిచేయడం. ఈ విషయంలో దేశాన్ని ఎందరో పాలించిన ప్రధానులు తాము చేయాల్సినది చేశారు. అయినా భారత్ ఏడున్నర దశాబ్దాల కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చేశంగా అయితే మారలేదు. మరి లోపం ఎక్కడ ఉంది. అంటే ఉంది అందరిలో ఉంది. రాజకీయాల్లో ఉంది. పాలనలో ఉంది. ఈ సిస్టంలో ఉంది.

వీటిని అన్నింటినీ మార్చేస్తామని చెబుతున్నారు దేశానికి ప్రధానులు కావాలనుకుంటున్న కొందరు నాయకులు. వీరంతా తమదైన విజన్ తో బంగారు భారతాన్ని సృష్టిస్తామని చెబుతున్నారు. ఢిల్లీని ఏలుతూ పంజాబ్ కోటను బద్ధలు కొట్టి రేపు గుజరాత్ లో కూడా జెండా పాతేందుకు ఉత్సాహపడుతున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఆరు సూత్రాలతో దేశం మొత్తాన్ని మార్చేస్తాను నంబర్ వన్ గా చేస్తాను అని అంటున్నారు.

అందరికీ మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఐదేళ్లలో భారత్ లో దారిద్ర్య నిర్మూలన, ప్రతి యువతీయువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళలకు సమాన అవకాశాలు, భద్రత, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, వ్యవసాయ పంటలకు పూర్తిస్థాయి మద్దతు ధరలు ఇలా తన అజెండాతో దేశం రూపాన్ని మార్చేసి అగ్రదేశంగా చేస్తాను అని కేజీవాల్ చెబుతున్నారు.

ఇక తెలంగాణాకు చెందిన ముఖ్యమంత్రి కేసీయార్ అయితే ఈ దేశంలో ఉన్న జీవనదుల నీరు ఉప్పు సముద్రం పాలు అవుతోంది అని అంటున్నారు ఆ నీటినే సక్రమంగా వడుకుని జాతీయ జల విధానం ద్వారా అందరికీ తాగు సాగు నీరు అందిస్తే దేశం ఎక్కడికో వెళ్తుందని అంటున్నారు. అలాగే పారిశ్రామీకరణ కూడా జరుగుతుందని చెబుతున్నారు.

దేశంలో ఉన్న వనరులు అన్నీ వాడేసుకుంటూ ముందుకు సాగితే భారత్ ఎపుడో నంబర్ వన్ దేశంగా ఉండేదని కేసీయార్ అంటున్నారు. తన విజన్ మొత్తాన్ని ఉపయోగించి భారత్ ని గొప్పగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.

ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఇవ్వడం ద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని చెబుతున్నారు. అంతే కాదు దేశంలో ఉన్న అన్ని రకాలైన వనరులను సక్రమంగా వినియోగించుకుంటే భారత్ కి తిరుగు ఉండదని అంటున్నారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయితే వివక్ష లేని సమాజం నిర్మాణం ద్వారా భారత్ అంతా ఒక్కటిగా చేయి కలిపితే ప్రపంచానికే దిశా నిర్దేశం చేసే స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు. ఇలా రేపటి రోజున ప్రధాని అవుదామని భావిస్తున్న వారు అంతా భారత్ ని ఎక్కడో నిలబెట్టాలని తమదైన మేధస్సుని ముందు పెట్టి మరీ ఆలోచిస్తున్నారు.

మరి ప్రధాని మోడీయే ఈ దేశానికి అసలైన నాయకుడు అని బీజేపీ అంటోంది. మరి ప్రధాని మోడీకి హ్యాట్రిక్ చాన్స్ ఇస్తారా లేక ఇపుడు చెబుతున్న వారిలో ఎవరో ఒకరిని కుర్చీలో కూర్చోబెడతారా. ప్రజలదే అంతిమ నిర్ణయం. అందుకోసం 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.