Begin typing your search above and press return to search.

బెదిరించి మ‌రీ మ‌హారాష్ట్రను బీజేపీ ద‌క్కించుకోవాల‌నుకుందా?

By:  Tupaki Desk   |   10 Feb 2022 2:30 PM GMT
బెదిరించి మ‌రీ మ‌హారాష్ట్రను బీజేపీ ద‌క్కించుకోవాల‌నుకుందా?
X
మ‌హారాష్ట్రలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ అధికారం దక్కించుకోలేక‌పోయిన బీజేపీ.. ఎలాగైనా ఆ రాష్ట్రంలో గ‌ద్దెనెక్కే ప్ర‌య‌త్నాలు చేస్తుందా? అధికార ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు బెదిరింపుల‌కు కూడా వెన‌కాడ‌డం లేదా? శివ‌సేన రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ వ్యాఖ్య‌లు ప్ర‌కారం ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు కుట్ర జ‌రుగుతుంద‌ని ఎంపీ సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకు స‌హ‌కరించాలంటూ కొంత‌మంది వ్య‌క్తులు త‌న‌ను క‌లిసి అడిగార‌ని, లేదంటే జైలుకు పంపుతామ‌ని బెదిరించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

2019 ఎన్నిక‌ల్లో 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీజేపీ 105 సీట్లు గెలిచింది. శివ‌సేన 56, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజ‌యాలు ద‌క్కించుకున్నాయి. కానీ త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే క్ర‌మంలో ఏర్ప‌డ్డ విభేదాల కార‌ణంగా బీజేపీ, శివ‌సేన విడిపోయాయి.

కానీ అధికారం ద‌క్కించుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన 145 సీట్లు లేక‌పోయినా.. ఎక్కువ స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ శివ‌సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ క‌లిసి మ‌హా వికాస్ అఘాఢీగా కూట‌మి ఏర్పాటు చేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైన బీజేపీ అధికార కూట‌మిపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది.

ఇప్పుడు ఆ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించేది బీజేపీనేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌ర్కారు కూలిపోతే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లొచ్చ‌ని త‌న‌ను క‌లిసిన వ్య‌క్తులు చెప్పార‌ని సంజ‌య్ రౌత్ తెల‌ప‌డం అందుకు బ‌లాన్ని చేకూరుస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. స‌ర్కారును కూల్చేందుకు ఈడీ వంటి కేంద్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల‌ను వాడుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ కూడా అయిన ఉప రాష్ట్రప‌తికి ఆయ‌న లేఖ రాశారు.

ఈ అధికార దుర్వినియోగం, రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను వేధిస్తున్న తీరుపై స్పందించాల‌ని కోరారు. ఆ లేఖ‌ల‌ను త‌మ కూట‌మి భాగ‌స్వామ్య ప‌క్షాల అగ్ర నాయ‌కులు రాహుల్ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్‌ల‌కు కూడా పంపించారు. ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తూ త‌గ్గేదేలే అంటూ హిందీలో సంజ‌య్ పేర్కొన్నారు. బీజేపీతో క‌లిసి ఈడీ అధికారులు క్రిమిన‌ల్ సిండికేటుగా ఎలా మారారో కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఆయ‌న చెప్పారు. స‌ర్కారును గ‌ద్దె దించేందుకు క‌లిసి రాక‌పోతే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని, జైలు జీవితం కూడా గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని బెదిరించార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.