Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ నే బీజేపీ నమ్ముకుందా?

By:  Tupaki Desk   |   29 Nov 2020 7:30 PM IST
సెంటిమెంట్ నే బీజేపీ నమ్ముకుందా?
X
హిందుత్వ వాదమే బీజేపీ ఏజెండా. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు. ప్రజలకు ఏం చేస్తామని చెప్పకుండా రోహింగ్యాలు, పాకిస్తానీలను ఏరివేస్తామంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం పక్కదారి పట్టించి ఇప్పుడు ఈ కొత్త వాదనను తెరపై కి తెచ్చారు. తాజాగా యూపీ సీఎం కూడా ఏకంగా హైదరాబాద్ పేరు మారుస్తామని అంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకే ఉందని ఆధిత్యనాథ్ అన్నారు. ఇప్పటిదాకా పలు నగరాల పేర్లు మార్చామని.. హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగరంగా మార్చుతామని చెప్పారు.

యూపీలో 30 లక్షలమందికి ఇళ్లు కట్టించామని.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్లలో ఎంతమందికి ఇళ్లు కట్టించిందో చెప్పాలని ఆధిత్యనాథ్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం పథకాన్ని పారనివ్వకూడదని.. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ధ్వజమెత్తారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా అంటూ యోగి ప్రజలను ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం వరదసాయం పేరిట మోసం చేసిందని.. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే ఈ నగదును పంపిణీ చేయలేదని యోగి ఆరోపించారు.

బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తే అభివృద్ధి, సంక్షేమం కంటే భావోద్వేగాలు, సెంటిమెంట్ రాజకీయాలనే నమ్ముకున్నట్టు కనిపిస్తోందని వారి ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది.